ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన స్మృతి మంధాన

sports |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 09:32 PM

భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వన్డే ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 5,000 పరుగుల మైలురాయిని అందుకున్న క్రీడాకారిణిగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆదివారం ఆమె ఈ అరుదైన ఘనతను సాధించింది.ఈ మ్యాచ్‌కు ముందు 5 వేల పరుగుల మార్కుకు చేరువలో ఉన్న మంధన, తన 112వ వన్డే ఇన్నింగ్స్‌లో ఈ రికార్డును అందుకుంది. నేటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ కిమ్ గార్త్ వేసిన 21వ ఓవర్‌లో అద్భుతమైన సిక్సర్ బాది ఆమె ఈ మైలురాయిని పూర్తి చేసుకోవడం విశేషం. దీంతో, వెస్టిండీస్ క్రీడాకారిణి స్టెఫానీ టేలర్ పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. టేలర్ 129 మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించగా, మంధన కేవలం 112 మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించింది. ఈ జాబితాలో సుజీ బేట్స్ (136), మిథాలీ రాజ్ (144), చార్లెట్ ఎడ్వర్డ్స్ (156) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన మంధన, కేవలం 66 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేసి సోఫీ మోలినెక్స్ బౌలింగ్‌లో అవుటైంది. ఈ ప్రపంచకప్‌లో తొలి మూడు మ్యాచ్‌లలో కేవలం 54 పరుగులే చేసి నిరాశపరిచినప్పటికీ, ఈ ఇన్నింగ్స్‌తో ఆమె తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటికే 974 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా నిలిచిన మంధన, ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కూడా రెండు సెంచరీలతో రాణించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa