ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోహిత్, కోహ్లీ భవితవ్యంపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

sports |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 10:23 PM

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ .. ఇప్పుడు భారత క్రికెట్‌లో ఈ ఇద్దరి గురించి విస్తృతంగా చర్చ నడుస్తోందని చెప్పొచ్చు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో.. భారత్ వన్డే సిరీస్ ఆడనున్న క్రమంలో సిరీస్ ఫలితం పక్కనబెడితే ఈ ఇద్దరు ఎలా ఆడతారనేదానిపైనే ఉత్కంఠ నెలకొంది. సగటు భారత క్రికెట్ అభిమాని ఇందుకోసం ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. అవును.. చాలా రోజుల తర్వాత వీరు మళ్లీ భారత్ తరఫున బరిలోకి దిగబోతున్నారు. ఈ మధ్య కాలంలో ఇరువురూ టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. మరోవైపు గతేడాది టీ-20 వరల్డ్ కప్ భారత్ గెలిచిన తర్వాత.. అదే రోజున ఇరువురూ అంతర్జాతీయ టీ-20లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఇద్దరూ కేవలం వన్డే ఫార్మాట్లోనే ఆడుతున్నారు.


ఇక్కడే వీరు ఈ ఫార్మాట్‌లో ఇంకెన్ని రోజులు ఆడతారో.. ఎన్ని రోజులు ఆడగలరో.. వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకు ఆడతారా.. అని ఇలా ఎన్నో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇది అభిమానులకే కాదు.. వారిలోనూ దీని గురించే ఆలోచనలు ఉంటాయని చెప్పొచ్చు. ఇద్దరూ.. ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్ కప్ వరకైనా ఆడాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ ట్రోఫీ నెగ్గి.. ఘనంగా వీడ్కోలు చెప్పాలని చూస్తున్నారు.


కానీ.. వీరి భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. 2027 ప్రపంచకప్ నాటికి రోహిత్‌కు 40, కోహ్లీకి 38 ఏళ్లు వస్తాయి. ఇప్పటికే పలువురు ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు, కామెంటేటర్లు.. దీనిపై తలో మాట చెబుతున్నారు. కొందరు ఆడగలరని చెబుతున్నప్పటికీ.. చాలా మంది మాత్రం అప్పటికి వీరి వయసు చాలా ఎక్కువ ఉంటుందని.. ఫిట్‌నెస్, ఫామ్ కాపాడుకోవడం కష్టమని అంటున్నారు. ఇప్పుడు ఇదే విషయమై భారత్ జట్టు మాజీ కోచ్, స్టార్ కామెంటేటర్ రవిశాస్త్రి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.


"2027లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో చోటే లక్ష్యంగా ఇప్పుడు వారు ఇక్కడ ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం వస్తున్నారు. వారి ఫిట్‌నెస్, ఫామ్, క్రికెట్‌కు వారు ఇచ్చే ప్రాధాన్యంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ సిరీస్ వారిద్దరికీ చాలా ముఖ్యమని నేను భావిస్తున్నా. సిరీస్ ముగేసేలోపు వారికే ఒక స్పష్టత వస్తుంది. అప్పుడు వారే తమ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది." అని రవిశాస్త్రి చెప్పారు.


ఇదే సమయంలో.. అనుభవజ్ఞులు ఎంత రాణించినప్పటికీ.. పెద్ద మ్యాచ్‌ల్లో ఆడినప్పటికీ.. యువకుల నుంచి గట్టి పోటీ నెలకొందని అన్నారు రవిశాస్త్రి. ఇటీవలి కాలంలో శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మ వంటి మంచి యువ ఆటగాళ్లు భారత్ తరఫున అద్భుతంగా ఆడుతున్నారని.. ఇక్కడ ముఖ్యంగా ఇటీవల ఆసియా కప్‌ ఫైనల్‌లో తిలక్ వర్మ పాకిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ను ప్రస్తావించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చివరిసారి రోహిత్, కోహ్లీ.. భారత్‌కు ప్రాతినిథ్యం వహించగా.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనున్నారు. అందులో ఎలా ఆడతారనే దానిపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa