ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో టెస్టులో ఫీల్డర్‌గా మిగిలిపోయిన నితీష్ కుమార్ రెడ్డి,,,ఢిల్లీ టెస్టులో టీమిండియా నిర్ణయంపై షాక్

sports |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 11:21 PM

ఇంగ్లండ్ టూర్ నుంచి అర్ధంతరంగా డ్రాప్ అయిన నితీష్ కుమార్ రెడ్డి వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఆడిన రెడ్డి అంతగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే, ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ.. బౌలింగ్ విషయంలో టీమిండియా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందర్నీ షాక్‌కు గురి చేస్తోంది.


వెస్టిండీస్‌తో ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో భారత జట్టులో చోటు దక్కించుకున్న ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి ఒక్క ఓవర్ కూడా వేయకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదే విషయమై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా ప్రశ్నలు లేవనెత్తాడు. రెండు ఇన్నింగ్స్‌లలో భారత బౌలర్లు మొత్తం 200 ఓవర్లు విసరగా, ఆల్‌రౌండర్‌గా ఎంపికైన నితీష్‌కి మాత్రం ఒక్క బంతి కూడా ఇవ్వలేదు. ఆఖరికి జైస్వాల్ కూడా బౌలింగ్ చేయగా, నితీష్ కుమార్ రెడ్డికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు.


వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో భారత్ ఫాలో ఆన్ విధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ బ్యాటర్లు అద్భుతంగా రాణించి భారత బౌలర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. జాన్ క్యాంప్‌బెల్ (115), షై హోప్ (103) సెంచరీలతో అద్భుత ప్రతిఘటన కనబరిచారు. దాంతో కెప్టెన్ శుభమన్ గిల్ తరచూ బౌలింగ్ మార్పులు చేసినా ఫలితం కనిపించలేదు. విండీస్ చివరకు 390 పరుగులు చేసి భారత్‌కు 121 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.


టీమిండియా నిర్ణయంపై స్పందించిన మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా “నితీష్ రెడ్డి ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. అతన్ని బౌలింగ్ చేయనివ్వకపోవడం నాకు అసలు అర్థం కాలేదు. మొదటి టెస్టులో అతనికి బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఇప్పుడు రెండో టెస్టులో బౌలింగ్ కూడా చేయనివ్వలేదు. ఒక దశలో భారత్ అందరు బౌలర్లను ప్రయత్నించినా వికెట్లు రాలేదు. అలాంటి పరిస్థితిలో నితీష్‌కి అవకాశం ఇవ్వకపోవడం సరైంది కాదు” అని పేర్కొన్నాడు.


“ఇది కెప్టెన్ శుభమన్ గిల్ నిర్ణయమా, లేక కోచ్ సూచనా అన్నది స్పష్టంగా తెలియదు. కానీ ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉన్న ఆటగాడిని పూర్తిగా పక్కనపెట్టడం టీం ప్లానింగ్‌లో స్పష్టమైన లోపాన్ని చూపిస్తుంది. ఈ నిర్ణయం ఆధారంగా ఇప్పుడు రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు నెంబర్ 6 స్థానంపై కొత్త చర్చ మొదలైంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నా వికెట్లు రాకపోతే కనీసం ఆల్‌రౌండర్‌కి ఓ అవకాశం ఇవ్వడం సహజం. కానీ భారత్ ఆ ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యం. ఇది కెప్టెన్ నిర్ణయమా, లేక కోచ్ వ్యూహమా అన్నది చెప్పలేము. కానీ నితీష్ ఒక్క బంతి కూడా వేయకపోవడం సరికాదు” అని చోప్రా అభిప్రాయపడ్డాడు.


ఈ టెస్టు సిరీస్‌లో నితీష్ రెడ్డి ఇప్పటివరకు కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. మొదటి టెస్టులో అతనికి బ్యాటింగ్ అవకాశం రాలేదు. రెండో టెస్టులో మాత్రం 54 బంతులు ఆడి 43 పరుగులు చేశాడు. అయినా బౌలింగ్‌లో ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం అతని ఆల్‌రౌండర్ పాత్రను ప్రశ్నార్థకంగా మార్చింది.


ఇక ఢిల్లీలో భారత్ 121 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఐదో రోజు సులభంగా ఛేదించి సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. కానీ నితీష్ రెడ్డి బౌలింగ్‌ను ఉపయోగించకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. పలువురు అభిమానులు, మాజీ ఆటగాళ్లు ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఆల్‌రౌండర్‌ను తీసుకుని ఎందుకు బౌలింగ్ చేయనివ్వలేదంటూ విమర్శిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa