ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమ్మతొక్కలతో మీ చర్మం మెరిసేలా చేసుకోవచ్చు

Life style |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 11:37 PM

నిమ్మ తొక్కలు ఎందుకూ పనికి రావు అని చెత్త బుట్టలో పారేస్తుంటారు. కానీ నిజానికి ఇందులో ఉన్నన్ని న్యూట్రియెంట్స్ మరెక్కడా కనిపించవు. ముఖ్యంగా ఈ పోషకాలన్నీ చర్మాన్ని ఎంతో ఆరోగ్యకరంగా ఉంచేవే. ఈ నిమ్మ తొక్కల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, సిట్రిక్ యాసిడ్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. ఇన్ని పోషకాలుంటాయి కాబట్టి చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి అంత బాగా తోడ్పడతాయి.


కేవలం చర్మాన్ని మెరిపించడమే కాదు. మొటిమలు, డార్క్ స్పాట్స్ ని తొలగించడంలోనూ నిమ్మ తొక్కలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా డెడ్ సెల్స్ ని తొలగించడంలో ఇవి చాలా బాగా సహకరిస్తాయి. నిజానికి ఈ ప్రయోజనాలన్నీ నిమ్మరసంలో మాత్రమే ఉంటాయి అనుకుంటారు. కానీ నిమ్మ తొక్కల్లోనూ ఇవే పోషకాలుంటాయి. పైగా వీటిని సరైన విధంగా వాడడం తెలిస్తే చర్మంపై మృతకణాలు అన్నీ తొలగిపోయి ఆరోగ్యకరంగా తయారవుతుంది. మరి నిమ్మతొక్కలను ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం.


ఇలా వాడవచ్చు


నిమ్మ తొక్కలను పొడిగా చేసి చర్మానికి మంచి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇది చేయాలంటే ముందుగా ఓ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. దీన్నే లెమన్ పీల్ పౌడర్ ఫేస్ ప్యాక్ అంటారు. ముందుగా నిమ్మ తొక్కలను తీసి బాగా ఎండ బెట్టాలి. అవి పూర్తిగా ఎండిపోయేంత వరకూ అలాగే ఉంచాలి. అయితే తాజా నిమ్మకాయల నుంచి తీసిన తొక్కలను వాడితే వాటిలో ఎక్కువ పోషకాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది.


అయితే ఎండ బెట్టిన నిమ్మ తొక్కలను బాగా గ్రైండ్ చేయాలి. మెత్తగా పొడిలా మారేంత వరకూ మిక్సీ పట్టాలి. ఈ పౌడర్ లో ఊరికే నీళ్లు కలిపి ఫేస్ ప్యాక్ లా పెట్టుకుంటే పెద్దగా ఎఫెక్ట్ అనిపించదు. అందుకే మామూలు నీళ్లకు బదులుగా రోజ్ వాటర్ కలిపితే చాలా మంచిది. లేదా యోగర్ట్ కలపవచ్చు. ఈ రెండింటిలో ఏది వాడినా సరే సరైన ఎఫెక్ట్ కనిపిస్తుంది. వీటిని బాగా మిక్స్ చేసిన తరవాత ముఖానికి అప్లై చేయాలి. ఫేస్ ప్యాక్ లా సరైన విధంగా రాసుకోవాలి. ఓ అరగంట పాటు అలాగే ఉంచుకుని చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి.


లెమన్ పీల్ స్క్రబ్


ఈ స్క్రబ్ తయారీకి కూడా లెమన్ పీల్స్ ని ముందుగా ఎండ బెట్టాల్సి ఉంటుంది. ఇవి పూర్తిగా డ్రైగా మారిన తరవాత మిక్సీ పట్టాలి. మెత్తగా పొడి చేయాలి. ఆ తరవాత లెమన్ పీల్ స్క్రబ్ చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఓ టేబుల్ స్పూన్ లెమన్ పీల్ పౌడర్ లో ఓ టేబుల్ స్పూన్ చక్కెర, ఓ టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. అయితే మామూలుగా రాయడం అని కాకుండా మసాజ్ లా చేయాలి. ఇలా చేయడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు తొలగిపోవడంతో పాటు చర్మంపై డెడ్ సెల్స్ ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. అంతే కాదు. చర్మాన్ని చాలా మృదువుగా మార్చుతుంది ఈ స్క్రబ్. ఇది అప్లై చేసుకున్న తరవాత కనీసం ఓ పావుగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తరవాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా కనీసం ఓ పది రోజుల పాటు చేస్తే ముఖం మెరిసిపోతుంది.


అలోవెరా జెల్ తో 


మరో విధంగా కూడా నిమ్మ తొక్కలను వాడవచ్చు. అయితే ఈ సారి వీటితో పాటు అలోవెరా జెల్ కూడా అవసరం అవుతుంది. నిమ్మతొక్కలు తాజాగా ఉన్నప్పుడు వాటిలో కాస్తంత అలోవెరా జెల్ కలపాలి. ఈ రెండింటినీ బాగా మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని సరైన విధంగా ముఖంపై రాసుకోవాలి. అంటే ఫేస్ మాస్క్ లాగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా కనీసం పావుగంట పాటు ఉంచుకోవాలి.


ఇలా చేయడం వల్ల నల్లగా మారిన చర్మం తెల్లగా మారిపోతుంది. అంతే కాదు. మొటిమలు, జిడ్డుదనం ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా చర్మంలో ఉండే ఇన్ ఫ్లమేషన్ తగ్గిపోయేందుకు ఈ మిశ్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. పావుగంట పాటు అలాగే ఉంచుకుని ముఖం కడుక్కుంటే సరిపోతుంది. ఇలా రెగ్యులర్ గా ఫేస్ ప్యాక్ చేసుకుంటే చాలా త్వరగా మొటిమలు తగ్గిపోయేందుకు వీలుంటుంది.


లెమన్ పీల్ టోనర్


ఈ పీల్ టోనర్ తయారు చేయడానికి ప్రాసెస్ కాస్త వేరుగా ఉంటుంది. ముందుగా తాజాగా ఉన్న నిమ్మతొక్కలను ఓ కప్పు నీటిలో బాగా బాయిల్ చేయాలి. కాసేపు నీరు మరిగిన తరవాత పూర్తిగా ఈ నీరు చల్లారే వరకూ అలాగే పక్కన పెట్టాలి. ఆ తరవాత ఈ నీటిని వడబోయాలి. ఈ నీటిని ఓ స్ప్రే బాటిల్ లో పోసి ఉంచితే మంచిది. దీన్ని స్కిన్ టోనర్ లా వాడవచ్చు. ఈ స్కిన్ టోనర్ వల్ల ముఖంపై ఉన్న ఓపెన్ పోర్స్ బిగుతుగా మారతాయి. అంతే కాదు. చర్మం చాలా ఆరోగ్యకరంగా మారుతుంది. అయితే మరో విధంగా కూడా నిమ్మ తొక్కలను వాడవచ్చు. ముందుగా నిమ్మ తొక్కలను పొడిలా చేయాలి. అందులో పచ్చిపాలు పోయాలి. కాసేపు అలాగే ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్ తరహాలో కనీసం పదిహేను నిముషాల పాటు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల నిమ్మతొక్కలు, పాలలోని గుణాలు కలిసి ముఖం వెలిగిపోయేలా చేస్తాయి.


ముల్తానీ మట్టితో


నిమ్మ తొక్కలను ముల్తానీ మట్టితో కలిపి కూడా పేస్ ప్యాక్ లా పెట్టుకోవచ్చు. దీనికి కూడా ఓ ప్రాసెస్ ఉంటుంది. ముందుగా ఓ టేబుల్ స్పూన్ నిమ్మ తొక్కల పౌడర్ ని తీసుకోవాలి. ఆ తరవాత అందులో ఓ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి కలపాలి. ఈ మిశ్రమం కాస్తంత వదులుగా అవడంతో పాటు పవర్ ఫుల్ గా మారాలంటే అందులో కచ్చితంగా రోజ్ వాటర్ యాడ్ చేయాలి. వీటన్నింటినీ కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని కనీసం పదిహేను నిముషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై జిడ్డుదనం అనేది తొలగిపోతుంది. ముఖ్యంగా మొటిమలు తరచూ అయ్యే వారు ఈ ఫేస్ ప్యాక్ ని ట్రై చేయవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa