ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ నెలకు ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ద మంత్'గా అభిషేక్ శర్మ

sports |  Suryaa Desk  | Published : Thu, Oct 16, 2025, 08:08 PM

టీమిండియా యువ సంచలనం, డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సెప్టెంబర్ నెలకు గానూ 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్' అవార్డును కైవసం చేసుకున్నాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో అతడు కనబరిచిన అద్భుతమైన ప్రదర్శనకు ఈ పురస్కారం దక్కింది. ఈ రేసులో అభిషేక్ తో పాటు అతని సహచరుడు కుల్దీప్ యాదవ్, జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ పోటీపడ్డారు.ఆసియా కప్‌లో అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 7 మ్యాచ్‌లలోనే ఏకంగా 200 స్ట్రైక్ రేట్‌తో 314 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ తో సహా పలు కీలక సమయాల్లో అద్భుతంగా రాణించి భారత్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.ఈ అవార్డు గెలుచుకోవడంపై అభిషేక్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. "ఈ ఐసీసీ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. జట్టు విజయాల్లో పాలుపంచుకున్నందుకు ఈ గుర్తింపు రావడం గర్వంగా ఉంది. కఠిన పరిస్థితుల నుంచి కూడా విజయాలు సాధించగల సత్తా ఉన్న జట్టులో నేను భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నా" అని ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాడు. తనకు స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పించిన టీమ్ మేనేజ్‌మెంట్‌కు, తనకు మద్దతుగా నిలిచిన సహచరులకు అతడు ధన్యవాదాలు తెలిపాడు.ప్రస్తుతం అభిషేక్ శర్మ ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా 931 రేటింగ్ పాయింట్లతో కెరీర్‌లోనే అత్యధిక రేటింగ్ సాధించి, డేవిడ్ మలన్ (919) రికార్డును కూడా బద్దలు కొట్టాడు. కాగా, ఈ నెల‌ 29 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో అభిషేక్ బరిలోకి దిగనున్నాడు. ఈ సిరీస్‌లో కూడా ఇదే ఫామ్ కొనసాగించి జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa