ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూర్వీకులను వెతుక్కొంటూ 150 ఏళ్ల తర్వాత భారత్‌కు

national |  Suryaa Desk  | Published : Sun, Oct 26, 2025, 07:42 PM

ఓ వ్యక్తి 150 ఏళ్ల తర్వాత తన మూలాలను వెతుక్కుంటూ మారిషస్ నుంచి భారత్‌కు వచ్చారు. మారిషస్ నుంచి ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాకు వచ్చిన రామ్‌‌రుజ్ జగ్గుర్నాథ్ (64) తన పూర్వీకులు ఉన్న గ్రామం గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ అంబర్ కుమార్ కర్, ఇతర అధికారులను కలిసి సాయం కోరారు. సొంతూరును వెదికేందుకు వారం రోజుల పాటు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ కథ విని చలించిపోయిన ఉన్నతాధికారులు అతడికి పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.


జాజ్‌పూర్ జిల్లాకు చెందిన జగ్గుర్నాథ్ దాస్ అనే 25 ఏళ్ల యువకుడు 1870 నవంబరు 30న ఒప్పందం కార్మికుడిగా పనిచేసేందుకు మారిషస్‌కు వెళ్లారు. అతడు కోల్‌కతా పోర్టు నుంచి అలంఘీర్ నౌకలో ఆ దేశానికి చేరుకున్నారు. అక్కడే పెళ్లి చేసుకున్న ఆయన నలుగురు పిల్లలు కాగా.. 1912లో 67 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అయితే, ఆయన కుటుంబానికి చెందిన నాలుగు తరాల వారసులు ఒడియా భాషలోనే మాట్లాడేవారు. కానీ, కాలక్రమేణ అక్కడివారితో అనుబంధం పెనవేసుకుని తమ మాతృభాషను మరిచిపోయారు. కానీ, భారతీయ నేలతో ఉన్న భావోద్వేగ అనుబందం ఆయన ఐదో తరం వారుసుడ్ని ఇక్కడకు రప్పించేలా చేసింది. తన మూలాలను వెతుక్కొంటూ రామ్‌రజ్ ఒడిశాకు వచ్చారు.


ఇంగ్లిష్ మాట్లాడే అతడికి అంతగా ఒడియా భాష రాదు. అయితే, తన పూర్వీకులు వైతరణీ నది గురించి నిత్యం తమతో చెప్పేవారని తెలిపారు. దీంతో ఆయన్ను అధికారులు వైతరణీ వద్దకు తీసుకెళ్లారు. నదీ తీరంలోని సిద్ధేశ్వర పీఠం వద్ద తన పూర్వీకులు పిండ ప్రదానం చేశారు. తన పెదనాన్న అస్థికలను వైతరణీ నదిలో నిమజ్జనం చేశారు. తన చితాభస్మాన్ని వైతరణిలో కలపాలనేది ఆయన చివరి కోరిక అని భావోద్వేగానికి గురయ్యారు. ఆ జిల్లాలోని ప్రముఖ 'మా బిరజా' ఆలయాన్ని రామ్‌రజ్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.


1840 నుంచి 1870 మధ్యకాలంలో ఒడిశా కరువు కోరల్లో చిక్కుకుని వేలాది మంది ఆకలితో చనిపోయారు. ఈ క్రమంలో అక్కడ ప్రజలు ఉపాధి వెదుక్కొంటూ సముద్ర మార్గంలో విదేశాలకు వెళ్లారు. ఈ కాలంలో దాదాపు 3,500 మంది ఒడిశా నుంచి మారిషస్‌‌కు వెళ్లగా.. వీరిలో ఎక్కువ మంది జాజ్‌పూర్‌ జిల్లావాసులే. ఇలా వెళ్లినవారిలో జగన్నాథ్ దాస్ ఒకరు. మారిషస్‌లోని రాఫ్రీ బ్రదర్స్ కంపెనీలో కార్మికుడిగా చేరి.. తర్వాత గౌరెజ్ అండ్ కోలో పనిచేశారు. ప్రస్తుతం రామ్‌రథ్ పూర్వీకుల ఊరు కోసం అప్పటి భూ, ఓడరేవు, ఆలయాల రికార్డులు, గ్రామాల పటాల సాయంతో అన్వేషిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa