ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొంథా తుపాను ఎఫెక్ట్.. వారికి రూ.3000 సాయం.. సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 06:39 PM

రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొంథా తుపాను ఏపీ తీరం వైపు దూసుకువస్తున్న నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు. ఎస్పీలతో సమీక్షించారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎం.. అధికారులకు పలు సూచనలు చేశారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉండే ఒక్కో కుటుంబానికి 3000 రూపాయలు చొప్పున అందించాలని అధికారులను ఆదేశించారు. నగదు సాయంతో పాటుగా ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ప్రజల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని.. అత్యవసర వైద్య సేవలు అందించేలా జిల్లాల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.


మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మొంథా తుపాను వలన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాతావరణం మీద, తుపాను కదలికల మీద ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ సమాచారం అందించాలని సూచించారు. సముద్రతీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని.. వారిని వెంటనే పునరావాసం కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.


భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ బలగాలను మోహరించినట్లు చంద్రబాబు వివరించారు. తుపాను కారణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే రహదారుల మరమ్మతులు, డ్రెయిన్ల పునరుద్ధరణ, ఈదురు గాలుల కారణంగా విరిగిపడ్డ చెట్లను తొలగించేలా బృందాలను అందుబాటులో ఉంచామని చంద్రబాబు తెలిపారు.


మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్చేసి మాట్లాడినట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రం భరోసా ఇచ్చిందన్నారు. ప్రజలు అంతా ప్రభుత్వ సూచనలు పాటించాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa