ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.3 కోట్ల అప్పు ఎగ్గొట్టిన స్నేహితులు.. డబ్బులిచ్చిన పాపానికి ప్రాణం తీసుకున్న డాక్టర్

Crime |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 09:47 PM

స్నేహం, నమ్మకం పునాదిగా ఇతరులకు అప్పిచ్చి సహాయం చేయాలనుకున్న ఓ వైద్యుడి జీవితం.. ఆ స్నేహితుల మోసం కారణంగా విషాదాంతమైంది. అప్పు తీసుకున్న స్నేహితులు తిరిగి చెల్లించకుండా మోసం చేయటంతో మనస్థాపంతో సూసైడ్ చేసుకున్నాడు. కరీంనగర్‌ జిల్లా నగునూరులోని ప్రతిమ వైద్య కళాశాలలో అనస్థీషియా పీజీ రెండో సంవత్సరం చదువుతున్న డాక్టర్ ఎంపటి శ్రీనివాస్ (42) స్నేహితుల కారణంగా అప్పుల పాలై, తీవ్ర మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.


వివరాల్లోకి వెళితే.. వైద్యుడిగా పని చేస్తున్న శ్రీనివాస్‌కు కష్టాల్లో ఉన్న స్నేహితులను ఆదుకోవాలనే మంచి మనసు శాపంగా మారింది. కరీంనగర్ ప్రాంతానికి చెందిన వింజనురి కరుణాకర్ అనే వ్యక్తికి రూ. 1.50 కోట్లు అప్పుగా ఇచ్చారు. అంతేకాకుండా.. మరో ముగ్గురు స్నేహితులు కిరణ్, కవిత, వెంకట నరహరి కలిసి శ్రీనివాస్ పేరుపై ఏకంగా రూ. 1.35 కోట్ల బ్యాంకు రుణం తీసుకున్నారు. బంజేరుపల్లికి చెందిన కుమారస్వామి తన వ్యాపారం కోసం మరో రూ. 28 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ విధంగా మొత్తం రూ. 3 కోట్లకు పైగా అప్పు భారం డాక్టర్ శ్రీనివాస్ నెత్తిపై పడింది.


అప్పు తీసుకునేటప్పుడు స్నేహాన్ని అడ్డుపెట్టుకున్న వీరంతా.. తిరిగి చెల్లించాల్సిన సమయం రాగానే మొహం చాటేశారు. డాక్టర్ శ్రీనివాస్ పేరు మీద ఉన్న బ్యాంకు రుణాలకు ఈఎంఐలు సక్రమంగా చెల్లించకపోవడంతో.. బ్యాంకు అధికారులు శ్రీనివాస్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. మరోవైపు అప్పు తీర్చమని స్నేహితులను అడిగితే.. వారు డబ్బు ఇవ్వమని.. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరింపులకు దిగడంతో శ్రీనివాస్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఒకవైపు బ్యాంకు వేధింపులు, మరోవైపు నమ్మిన స్నేహితులు చేసిన మోసంతో చితికిపోయిన శ్రీనివాస్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


అత్యవసరంలో అప్పిచ్చి ఆదుకోవడం మానవత్వమే అయినప్పటికీ.. ఆ అప్పు తిరిగి రానప్పుడు అది వ్యక్తి జీవితంలో ఎలాంటి చిచ్చు పెడుతుందో ఈ ఉదంతం కళ్ళకు కట్టినట్టు చూపింది. మంచి మనసుతో చేసిన సహాయం, బ్యాంకు వేధింపులు, స్నేహితుల ద్రోహం.. ఇవన్నీ ఒక వైద్యుడికి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa