ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు,,,,తుపాను వెళ్లిపోయినా వదలని వరుణుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 09:52 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొంథా తుఫాను నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా రాష్ట్రంపై కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గురువారం కూడా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మొంథా తుఫాు ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల చెరువులు, కాలువలు ,వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని.. వాటిని దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరో రెండు రోజుల వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


మరోవైపు మొంథా తుపాను తీరం దాటి వెళ్లిపోయిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తుఫాను తదనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. పకడ్బందీగా పారిశుద్ధ్య పనుల కోసం మొబైల్ బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని.. తాగు నీరు సరఫరాకు ఇబ్బంది ఏర్పడిన చోట్ల ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు


మొంథా తుపానును సమర్థంగా ఎదుర్కొన్నామన్న పవన్ కళ్యాణ్.. తుపాను అనంతర చర్యలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. ఈ సమయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖలు యుద్ధ ప్రాతిపదికన పని చేయాలని సూచించారు. తుపాను, భారీ వర్షాలు తగ్గాక గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య, తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉందన్న పవన్ కళ్యాణ్.. ఎక్కడా ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని అధికారులకు సూచించారు. మరోవైపు సమీక్ష సందర్భంగా మొంథా తుపానుతో రాష్ట్రంలోని 1583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు అధికారులు తెలియచేశారు. శానిటేషన్ సిబ్బందిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకున్నామని చెప్పారు. 38 చోట్ల రోడ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయనీ, మరో 125 చోట్ల రహదారులకు గుంతలు ఏర్పడ్డాయని వివరించారు. రక్షిత తాగు నీటి పథకాల ట్యాంకులు దగ్గర క్లోరినేషన్ ప్రక్రియ చేస్తున్నామని వివరించారు.


ఈ సందర్భంగా గ్రామాల్లో మొబైల్ శానిటేషన్ బృందాలను సిద్ధంగా ఉంచాలన్న పవన్ కళ్యాణ్.. 21,055 మంది పారిశుద్ధ్య సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి పారిశుద్ధ్య మెరుగుదలకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని గ్రామాల్లో వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే దెబ్బ తిన్న రహదారుల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa