కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి ఆరెస్సెస్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశంలో ఎక్కువగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తడానికి భారతీయ జనతాపార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కారణమని ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో ఆరెస్సెస్ను నిషేధించాలని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని తెలిపారు. గతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఇదే చేశారని చెప్పిన ఖర్గే.. 1948లో మహాత్మా గాంధీ హత్య తర్వాత ఆరెస్సెస్ను విమర్శిస్తూ పటేల్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా.. కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలను కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పికొట్టారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఆరెస్సెస్ కోసం పనిచేయొద్దని సర్దార్ పటేల్ చెప్పినట్లు ఖర్గే గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆరెస్సెస్, జమాత్ ఇ ఇస్లామి వంటి సంస్థల కార్యక్రమాల్లో పాల్గొనకుండా పటేల్ నిషేధం విధించారని గుర్తుచేశారు. అయితే మోదీ ప్రభుత్వం గతేడాది జులైలో ఆ నిషేధం ఎత్తివేసిందన్నారు. దేశం కోసం పటేల్ చాలా సేవ చేశారని.. ఆయన మరణాన్ని మిఠాయిలు పంచి ఆరెస్సెస్ వేడుకలా జరుపుకుందని.. ఈ విషయాన్ని ఓ లేఖలో స్వయంగా సర్దార్ పటేల్ పేర్కొన్నారని ఖర్గే చెప్పారు. అందుకే ఆరెస్సెస్ను నిషేధించారని తెలిపారు. ఆరెస్సెస్, హిందూ మహాసభ సిద్ధాంతాలే మహాత్మ గాంధీ హత్యకు కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఇటీవల ప్రియాంక్ ఖర్గే కూడా ఆరెస్సెస్ను బ్యాన్ చేయాలని కర్ణాటక సీఎంకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
బీజేపీ కౌంటర్..
ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లకు పైగా పటేల్ను విస్మరించిందని.. ఆయన సేవలను తక్కువ చేసిందని ఆరోపించింది. వారు ఎప్పుడూ పటేల్ అడుగుజాడలను నడవలేదని.. ఇప్పుడు ఆరెస్సెస్ను వ్యతిరేకించడానికి ఆయన పేరును వాడుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. "ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు.. ఇండియన్ నాజీ కాంగ్రెస్. వారి అన్ని కుట్రలు చేసినా.. కోర్టు ఆరెస్సెస్పై నిషేధాన్ని ఎత్తివేసింది. ఆరెస్సెస్ రాజకీయేతర సంస్థ. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. ఇలా ఉద్యోగులు పాల్గొంటుండటంపై కాంగ్రెస్ చాలా అసహనంగా ఉంది. కాంగ్రెస్ నేతలు.. పీఎఫ్ఐ, ఎస్డీపీఐ, ఎంఐఎం వంటి ర్యాడికల్ సంస్థల అల్లర్లకు మద్దతు ఇస్తారు. కానీ దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న ఆరెస్సెస్పై మాత్రం విషం కక్కుతున్నారు" అని పూనావాలా ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa