ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ శిక్షణా శిబిరానికి ఆలస్యంగా వచ్చిన రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Mon, Nov 10, 2025, 05:21 AM

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఓ సరదా శిక్ష పడింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల శిక్షణా కార్యక్రమానికి ఆలస్యంగా రావడంతో, ఆయన 10 పుష్-అప్‌లు తీయాల్సి వచ్చింది. ఆయన ఎలాంటి సంకోచం లేకుండా ఈ శిక్షను స్వీకరించడంతో, ఆలస్యంగా వచ్చిన ఇతర జిల్లా అధ్యక్షులు కూడా ఆయన్ను అనుసరించారు. దీంతో ఒక అధికారిక సమావేశం కాస్తా, ఆహ్లాదకరమైన కార్యక్రమంగా మారిపోయింది.కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని పచ్‌మఢీలో 'సంఘటన్ సృజన్ అభియాన్' పేరుతో పార్టీ బలోపేతం కోసం నిర్వహిస్తున్న శిక్షణా శిబిరంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బీహార్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ, రాహుల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఒక సెషన్‌కు ఆయన ఆలస్యంగా వచ్చారు.దీంతో శిక్షణా కార్యక్రమ ఇన్‌ఛార్జ్ సచిన్ రావు, ఆలస్యంగా వచ్చిన వారికి శిక్ష తప్పదని అన్నారు. అప్పుడు రాహుల్, "నేనేం చేయాలి?" అని అడగ్గా, "కనీసం 10 పుష్-అప్‌లు తీయాలి" అని సచిన్ రావు సరదాగా బదులిచ్చారు. తెలుపు టీ-షర్ట్, ట్రౌజర్‌లో ఉన్న రాహుల్ గాంధీ వెంటనే ఆ సూచనను పాటించారు. దీంతో అక్కడున్న జిల్లా అధ్యక్షులు కూడా ఆయన్ను అనుసరించారు. వారు కూడా పుష్-అప్‌లు తీశారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, "జిల్లా అధ్యక్షుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది" అని తెలిపారు.ఇదే సమావేశంలో రాహుల్ గాంధీ, అధికార బీజేపీపైనా, ఎన్నికల సంఘంపైనా విమర్శలు కొనసాగించారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ ఇలాంటి మోసాలే జరిగాయని అన్నారు. "కొన్ని రోజుల క్రితం నేను హర్యానా వ్యవహారాన్ని బయటపెట్టాను. అక్కడ ప్రతి 8 ఓట్లకు ఒకటి చొప్పున 25 లక్షల ఓట్లు దొంగిలించారు. ఇదే వారి వ్యవస్థ. మా వద్ద ఆధారాలున్నాయి, ఒక్కొక్కటిగా బయటపెడతాం" అని రాహుల్ పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa