భారత రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు జరిగిన ఒక్క రోజు వ్యవధిలోనే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇస్లామాబాద్లోని జిల్లా కోర్టు ప్రాంగణంలో కారులో పేలుడు సంభవించడంతో ఇప్పటివరకు 12 మంది దుర్మరణం పాలయ్యారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ పేలుడు ఘటనతో ఇస్లామాబాద్ ఒక్కసారిగా వణికిపోయింది. ఈ భారీ పేలుడు ఘటనలో చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు వెల్లడించారు. దీంతో వారిని హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే రాజధానిలో ఉన్న డిస్ట్రిక్ట్ కోర్టు కావడంతో.. అక్కడ చాలా మంది గుమిగూడి ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు. ఇక సరిగ్గా ఆ పేలుడు సంభవించిన ప్రాంతం సాధారణంగా విచారణలకు వచ్చిన సందర్శకులు, లాయర్లు, కోర్టు సిబ్బంది, పోలీసులతో రద్దీగా ఉంది. పేలుడు ధాటికి కోర్టు ముందు పార్క్ చేసిన అనేక వాహనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
పేలుడు సమయంలో భయంకరమైన శబ్దం వినిపించిందని.. ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ తర్వాత లాయర్లు, ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు భయంతో పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షి అయిన ఒక లాయర్ పేర్కొన్నారు. ఈ ఘటనతో అక్కడ మొత్తం ఒక్కసారిగా గందరగోళం నెలకొందని.. గేటు వద్ద రెండు మృతదేహాలు పడి ఉండగా తాను చూసినట్లు వెల్లడించారు. ఈ పేలుడు ధాటికి చెలరేగిన మంటల్లో అనేక కార్లు అంటుకున్నాయని వివరించారు.
పేలుడు కారణంపై సస్పెన్స్
అయితే ఈ పేలుడు ఎలా జరిగింది, కారణాలు ఏంటి అనేది మాత్రం పోలీసులు, అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే కారులోని గ్యాస్ సిలిండర్ పగిలిపోవడం వల్ల జరిగి ఉండవచ్చని పాకిస్తాన్ స్థానిక మీడియా అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే పోలీసులు మాత్రం వాటిని ధృవీకరించడానికి నిరాకరించారు.
ఇస్లామాబాద్లో పేలుడు జరగడానికి కేవలం ఒక రోజు ముందు.. అంటే సోమవారం రోజున ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలో పాకిస్తానీ బలగాలు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. వానా నగరంలోని ఆర్మీ కాలేజీలో క్యాడెట్లను బందీలుగా పట్టుకోవడానికి ఆరుగురు పాకిస్తానీ తాలిబాన్ మిలిటెంట్లు (ఒక ఆత్మహుతి కారు బాంబర్తో సహా) ప్రయత్నాలు చేశారు.
ఈ ఘటనలో పాకిస్తాన్ సైన్యం.. ఇద్దరు మిలిటెంట్లను హతమార్చారు. మరో ముగ్గురిని అదే భవనంలో నిర్భందించారు. ఈ ఉగ్రదాడిలో క్యాడెట్లు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. 16 మంది పౌరులు, పలువురు సైనికులు స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa