రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అని.. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి గెల్చిన తర్వాత మొహం చాటేయడం బాబుకు అలవాటేనని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. 2024 జూన్ నుంచి సూపర్ సిక్స్ పథకాలు అమలుచేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. తొలి ఏడాదే రైతుల పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టగా.. రెండో ఏడాది అరాకొర సాయంతో 7 లక్షల మంది రైతులకు మెండి చేయి చూపించారని మండిపడ్డారు. నెల్లూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, వైయస్.జగన్ హయాంలో 53.58 లక్షల మందికి రైతుభరోసా అందితే.. వారి సంఖ్యను 46.85 లక్షలకే కుదించిన చంద్రబాబుది రైతు ద్రోహి ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్ లో రూ.150 వరకు అధిక ధరకు అమ్ముకుంటున్నా.. రైతులకు కనీసం యూరియా అందించలేని ప్రభుత్వ అసమర్థతను ఆక్షేపించారు. విత్తనం నుంచి విక్రయం వరకు అన్నదాతకు అండగా వైయస్.జగన్ ప్రభుత్వం నిలబడితే... రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడిందని తేల్చి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa