నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం ప్రజల దశాబ్దాల కల తీరనుంది. ఏళ్ల నాటి నిరీక్షణకు తెరదించుతూ పొట్టేపాలెం బ్రిడ్జి నిర్మాణం మొదలు కానుంది. ఈ విషయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఏళ్ల నాటి కలకు త్వరలోనే స్వస్తి పలుకుతామన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి .. పొట్టేపాలెం బ్రిడ్జికి జనవరి 5వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. శనివారం రోజున ఎమ్మెల్యే ఆఫీసులో కోటంరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా జనవరి 5న పొట్టేపాలెం బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. ఐదు కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. శంకుస్థాపన చేసిన తర్వాత 8 నెలల్లోనే వంతెన నిర్మాణం పూర్తి చేసి.. ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అలాగే పొట్టేపాలెం కలుజు మీద వంతెన నిర్మాణం పూర్తయ్యే లోపు.. ములుముడి వద్ద కూడా బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు.
మరోవైపు పొట్టేపాలెం కలుజు వద్ద వంతెన నిర్మించాలని స్థానికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే వారి కోరిక మాత్రం నెరవేరలేదు. అయితే ఇటీవల ఈ దిశగా అడుగులు పడ్డాయి. పొట్టేపాలెం బ్రిడ్జి నిర్మాణానికి సాంకేతిక అనుమతులు కూడా ప్రభుత్వం నుంచి మంజూరయ్యాయి. దీంతో జనవరి ఐదో తేదీన శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. పొట్టేపాలెం కలుజు మీదుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో సహా మూడు నియోజకవర్గాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే అనేక గ్రామాలకు వెళ్లాలన్నా ఇదే మార్గం. అయితే వర్షాకాలంలో పొట్టేపాలెం కలుజు వద్ద నీరు నిలుస్తూ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వంతెన నిర్మంచాలని కొన్నేళ్లుగా కోరుతున్నారు.
అయితే 2024 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే వంతెన నిర్మిస్తామని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు వద్ద కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పొట్టేపాలెం వంతెన నిర్మాణానికి సాంకేతికపరమైన అనుమతులు మంజూరు చేశారు. రూ. 5 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. టెండర్లు ఖరారు చేసి జనవరి 5న బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
పొట్టేపాలెం బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే, మూడు నియోజకవర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. వాహనదారుల సమస్యలు తీరి.. రాకపోకలు సులభతరమవుతాయని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జనవరిలో శంకుస్థాపన చేసి 8 నెలల్లోగా పొట్టేపాలెం బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్తున్నారు. గడువులోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa