దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోలో తలెత్తిన తీవ్ర సంక్షోభం ఐదో రోజుకు చేరింది. పైలట్ల కొరత, ప్రణాళికా లోపాల కారణంగా వందలాది విమానాలు వరుసగా రద్దు కావడంతో ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించిన ఇండిగో, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పింది. కస్టమర్లకు చెల్లించాల్సిన రిఫండ్ల ప్రక్రియకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని శనివారం ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.కార్యకలాపాలను తిరిగి గాడిన పెట్టేందుకు తమ బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయని ఇండిగో తెలిపింది. "విమానాల షెడ్యూళ్లను స్థిరీకరించడం, ఆలస్యాన్ని తగ్గించడం, ప్రయాణికులకు పూర్తిస్థాయిలో మద్దతుగా నిలవడంపై ప్రధానంగా దృష్టి సారించాం. నిన్నటితో పోలిస్తే శనివారం రద్దయిన విమానాల సంఖ్యను 850కి తగ్గించగలిగాం. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను మరింత తగ్గిస్తాం" అని భరోసా ఇచ్చింది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని టెర్మినల్స్, వెబ్సైట్, నోటిఫికేషన్ల ద్వారా అందిస్తున్నామని, ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు బయల్దేరే ముందు తమ ఫ్లైట్ స్టేటస్ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించింది. రిఫండ్లకు సంబంధించిన సహాయం కోసం కస్టమర్ సపోర్ట్ను సంప్రదించాలని కోరింది.మరోవైపు, ఈ వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇండిగో యాజమాన్యానికి పలు కఠిన ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్లో ఉన్న రిఫండ్ల మొత్తాన్ని ఆదివారం రాత్రి 8 గంటల లోపు క్లియర్ చేయాలని అల్టిమేటం విధించింది. అంతేకాకుండా, ప్రయాణికుల నుంచి వేరుపడిన లగేజీని 48 గంటల్లోగా గుర్తించి, వారి నివాసానికి లేదా వారు కోరిన చిరునామాకు చేర్చాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ గడువులోగా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.ఈ క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న ప్రయాణికులకు ఉపశమనం కల్పించేందుకు భారతీయ రైల్వే శాఖ ముందుకు వచ్చింది. ఆకస్మిక రద్దీని తట్టుకునేందుకు దేశవ్యాప్తంగా 37 ప్రీమియం రైళ్లకు అదనంగా 116 కోచ్లను జత చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 114 అదనపు ట్రిప్పులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇండిగో విమానాలు రద్దు కావడంతో ఇబ్బందులు పడుతున్న వేలాది మంది ప్రయాణికులకు ఊరట లభించనుంది. మొత్తంగా ఇండిగో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అటు సంస్థ, ఇటు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa