ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏ దేశం ఒంటరి కాదు.... అమెరికాకు చైనా మెసేజ్

international |  Suryaa Desk  | Published : Sat, Dec 06, 2025, 09:16 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనపై స్పందించిన చైనా ప్రభుత్వ మీడియా.. ఇది ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన సందేశమని అభివర్ణించింది. ఏ దేశమూ ఒంటరి కాదని ప్రపంచానికి ఈ పర్యటన చాటిచెప్పిందని పేర్కొంది. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత రష్యాపై అమెరికా సహా పశ్చిమ దేశాల ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో.. చైనా చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. రష్యా-భారత్ సంబంధాలు అత్యంత వ్యూహాత్మకమైనవని.. బయటి నుంచి వచ్చే ఒత్తిడికి తట్టుకుని నిలబడే శక్తి ఈ రెండు దశాలకు ఉందని చైనా విదేశాంగ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ లి హైడాంగ్ వ్యాఖ్యానించారు.


పుతిన్ పర్యటన ద్వారా.. భారత్, రష్యా దేశాలు పరస్పర మద్దతుతో తమ స్వతంత్ర సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నట్లు.. ప్రపంచానికి సంకేతం పంపించాయని ప్రొఫెసర్ లి హైడాంగ్ తెలిపారు. ఈ బలమైన బంధం కారణంగానే రష్యా, భారత్‌ దేశాలపై.. అమెరికాతోపాటు పశ్చిమ దేశాల ఆంక్షలు, ఒత్తిడి విజయం సాధించలేవని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


భారత్, రష్యా దేశాల మధ్య పెరుగుతున్న స్వేచ్ఛాయుత విధానానికి ఇది నిదర్శనమని.. చైనా మీడియా వెల్లడించింది. రష్యా, భారత్‌ల మధ్య సమన్వయం, సహకారం చూస్తుంటే.. ఆ రెండు దేశాలు తమ స్వతంత్ర, స్వయంప్రతిపత్తి గల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవాలనే స్పష్టమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాయని అర్థం అవుతోందని ప్రొఫెసర్ లి హైడాంగ్ స్పష్టం చేశారు. ఏ దేశమూ ఒంటరి కాదని.. పుతిన్ పర్యటన ద్వారా భారత్, రష్యాలు.. ఒక స్పష్టమైన సంకేతాన్ని అంతర్జాతీయ సమాజానికి పంపించాయని తెలిపారు.


ప్రస్తుతం భారత్, రష్యా పరస్పరం మద్దతు పలుకుతుండటం.. బలమైన బంధం కలిగి ఉండటం వల్ల.. అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షలు లేదా ఒత్తిడి వాటి ముందు విజయం సాధించడం అసాధ్యమని ప్రొఫెసర్ హైడాంగ్ తేల్చి చెప్పారు. రష్యా-భారత్ బంధం బలంగా ఉన్నప్పటికీ.. భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి అమెరికా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తోందని చైనా అభిప్రాయం వ్యక్తం చేసింది.


ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తలెత్తే ముప్పును ఎదుర్కోవడంలో భారత్ భాగస్వామ్యం ఆవశ్యకతను.. అమెరికా తాజా జాతీయ భద్రతా వ్యూహం నివేదిక తేల్చి చెప్పింది. అదే సమయంలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కలిసి భారత్ క్వాడ్రిలేటరల్ సహకారాన్ని (క్వాడ్) కొనసాగించేందుకు.. వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని ఆ రిపోర్ట్ పేర్కొంది.


అమెరికాకు ప్రధాన ప్రత్యర్థి అయిన పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలోనే.. అమెరికా డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్ నేతృత్వంలోని ట్రంప్ పరిపాలన బృందం వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగించడానికి వచ్చే వారం భారత్‌కు రానుందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది. ఇది రెండు దేశాల మధ్య గతంలో ఉన్న సుంకాలు, వాణిజ్య విభేదాలను పరిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నాలను సూచిస్తుందని పేర్కొంది.


ఒకవైపు చారిత్రక రక్షణ మిత్రదేశమైన రష్యాతో బంధాన్ని బలోపేతం చేస్తూనే.. మరోవైపు ఇండో-పసిఫిక్ భద్రత కోసం అమెరికా నేతృత్వంలోని క్వాడ్‌ కూటమిలో పాల్గొంటున్న భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పుతిన్ పర్యటన, చైనా వ్యాఖ్యలు ప్రపంచానికి ఒక కీలక సందేశాన్ని ఇస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa