ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జపాన్‌ని వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

international |  Suryaa Desk  | Published : Tue, Dec 09, 2025, 08:54 PM

ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ ప్రథమ స్థానంలో నిలుస్తుంది. అందుకు ముఖ్య కారణం.. ఈప్రాంతం.. పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉండటం. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి జపాన్‌లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి 9.13 గంటల సమయంలో జపాన్‌లో శక్తివంతమైన భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 7.6గా నమోదయ్యింది. ఫలితంగా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.


ఈ భూకంప కేంద్రం.. జపాన్‌లో రెండవ అతిపెద్ద దీవి అయిన హుక్కౌక్కైడో తీరానికి సమీపంలో ఉన్న ఆవోమోరి నగరానికి దగ్గరలో.. సముద్ర మట్టానికి సుమారు 50 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు అధికారులు తెలిపారు. జపాన్ ఉత్తర తీరంలో సంభవించిన ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంత ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భారీ భూకంపం, సునామీ హెచ్చరికల నేపథ్యంతో.. భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాలు భద్రతా తనిఖీలు చేపట్టాయని అక్కడి మీడియా వెల్లడించింది.


భూకంపం వచ్చిన కాసేపటికే.. హొక్కైడోలోని ఉరకావా అలానే అమోరిలోని ముత్సు ఒగవారా తీరాల్లో.. సుమారు 40 సెం.మీ. మేర సునామీ అలలు తాకినట్లు అధికారులు ప్రకటించారు. భూకంప ప్రభావంతో ఏర్పడిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రధాని సనాయె తకాయిచి మీడియాకు వెల్లడించారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యం అని తెలిపారు. భూకంప ధాటికి హచినోహే సిటీలోని ఓ హోటల్‌లో పలువురు గాయపడినట్లు సమాచారం.


తరచుగా భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్‌ ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్స్ ఉన్న ప్రాంతంలో జపాన్ ఉండటం వల్ల తరచుగా టెక్టానిక్ ప్లేట్లు ఢీకొంటుంటంతో.. ఇక్కడ తరచుగా శక్తివంతమైన భూకంపాలు సంభవిస్తాయి. గతంలో.. గ్రేట్ కాంటో (1923), కోబే (1995), టోహోకు (2011) భూకంపాలు అత్యంత ప్రభావవంతమైనవి. ఇవి దేశానికి తీవ్ర స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టాలను కలిగించాయి.


జపాన్‌లో 1900–2016 మధ్య కాలంలో.. 163 సార్లు.. రిక్టర్‌ స్కేల్‌పై 7 కంటే ఎక్కువ తీవ్రత గల భూకంపాలు సంభవించాయి. అలానే 8.0 కంటే ఎక్కువ తీవ్రత ఉన్న భూకంపాలు 14 సార్లు వచ్చాయి. 2011లో సంభవించిన టోహోకు భూకంపం రిక్టర్ స్కేల్ మీద 9.0 తీవ్రతతో జపాన్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన భూకంపంగా నిలిచింది. దీని ప్రభావం వల్ల ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం కూడా జరిగింది. ఈ శక్తివంతమైన భూకంపం ప్రభావంతో..భారీ సునామీ వచ్చి.. సుమారు 15,000 మందికి పైగా మరణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa