సీఎం చంద్రబాబు మాదిరిగా డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ కూడా నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ, గత ప్రభుత్వంలో నాటి సీఎం శ్రీ వైయస్ జగన్ చేసిన మంచిని తన ఖాతాలో వేసుకొని క్రెడిట్చోరీ చేస్తున్నారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్రెడ్డి ఆక్షేపించారు. పంచాయతీ రాజ్ శాఖలో 10 వేల మందికి డీడీఓలుగా పదోన్నతి కల్పించామన్న పవన్ మాటలు, పూర్తిగా అవాస్తవమని, ఆ పోస్టులు జగన్గారి హయాంలో క్రియేట్ చేసినవని వెల్లడించారు. బాప్టిజమ్ తీసుకున్న పవన్కళ్యాణ్, హిందువుగా ఎప్పుడు మారారని ప్రశ్నించారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 40 గుళ్లు కూల్చివేస్తే, నోరు మెదపని పవన్కళ్యాణ్ హిందూ రక్షకుడు ఎలా అవుతాడని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్రెడ్డి నిలదీశారు. వేరొకరు చేసిన వాటిని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుని గొప్పలు చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవడం సీఎం చంద్రబాబు లక్షణం. ఆయన దత్తపుత్రుడు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ కూడా సరిగ్గా అదే బాటలో నడుస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖలో 10 వేల మందికి పదోన్నతి కల్పించామని పవన్ చెప్పుకోవడం ఆశ్చర్యకరం. అసలు దీనిపై ఆయనకు కనీస అవగాహన ఉందా? అన్న సందేహం వస్తోంది అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa