నిర్మాణంలో ఉన్న ఆలయం కూలిపోయి.. భారత సంతతి వ్యక్తి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. క్వాజులు నాటల్ ప్రావిన్సుల్లో డిసెంబరు 13న జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారతీయులు అత్యధికంగా ఉండే రెడ్క్లిఫే పట్టణంలో భారత సంతతికి చెందిన కుటుంబం న్యూ అహోబిలం నరసింహస్వామి ఆలయం నిర్మాణం చేపట్టింది. నాలుగు అంతస్తుల్లో ఈ ఆలయం నిర్మిస్తుండగా.. ఊహించని విధంగా కూలిపోయినట్టు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో భారత సంతతికి చెందిన విక్కీ జయరాజ్ పాండే సహా నలుగురు మృతి చెందినట్లు అధికారులువెల్లడించారు. ప్రమాద సమయానిక కార్మికులు, పలువురు ఆలయ సిబ్బంది విధుల్లో ఉన్నట్లు సమాచారం.
కానీ, శిథిలాల కింద ఎందరు చిక్కుకున్నారనే విషయంపై ఇంకా స్పష్టతలేదు. గత మూడు రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలు పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో వాటిని తొలగించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలాగే, ప్రతికూల వాతావరణం కూడా ఆటంకంగా మారిందని దక్షిణాఫ్రికా రియక్షన్ యూనిట్ అధికార ప్రతినిధి ప్రేమ్ బలరామ్ అన్నారు. కాబట్టి శిథిలాల కింద ఎంత మందది చిక్కుకున్నారో? ఖచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు. ఈ ఘటనలో చనిపోయిన భారత సంతతికి చెందిన విక్కీ జైరాజ్ పాండే ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. పాండే గత రెండేళ్లుగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు దేవాలయ అన్నదాన విభాగం డైరెక్టర్ శాన్వీర్ మహారాజ్ చెప్పారు.
ఈ ప్రమాదంపై ఈతెక్విని మున్సిపాల్టీ (డర్బన్) ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఆలయ నిర్మాణానికి నిర్వాహకులు ఎటువంటి అనుమతి తీసుకోలేదని, ఇది అక్రమ కట్టడమని పేర్కొంది. స్థానికంగా ఓ కొండపై రెండేళ్ల కిందట ఈ ఆలయ నిర్మాణం ప్రారంబించారు. కాగా, క్వాజులు నాటల్ ప్రావిన్సుల సాంస్కృతిక వ్యవహారాల మంత్రి తులసిజ్వే బతేలేజీ ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులు ప్రాణాలతో ఉంటారనే ఆశలు సన్నగిల్లినప్పటికీ అవసరమైనంత కాలం సహాయక చర్యలు కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు. రెస్క్యూ ఆపరేషన్కు ప్రత్యేక జాగిలాలను కూడా తీసుకొచ్చినట్టు ఆయన వెల్లడించారు.
మరోవైపు, న్యూ అహోబిలం ఆలయాన్ని, భారత్ నుంచి తరలించిన శిలలతో పాటు ఆ ప్రదేశం నుంచి తవ్వితీసిన రాళ్లను ఉపయోగించి ఒక గుహను పోలినట్లుగా నిర్మిస్తున్నారు. అంతేకాదు, ఆలయం మొదటి అంతస్తులో గుహ లాంటి రూపాన్ని సృష్టించడానికి వాటికి ప్లాస్టర్ వేశారు. రెండేళ్ల కిందట నిర్మాణం ప్రారంభించగా.. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన నరసింహస్వామి విగ్రహాన్ని ఇందులో ప్రతిష్ఠించనున్నట్టు ఆ కుటుంబం ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa