పల్నాడు జిల్లా వినుకొండలో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నల్లగా ఉన్నావంటూ భర్త, ఇంట్లోకి అడుగుపెట్టాక అశుభాలు జరుగుతున్నాయంటూ అత్తామామలు ఓ నవవధువును తీవ్రంగా వేధించారు. కట్నం సరిపోలేదంటూ ఇంటి నుంచి గెంటేయడంతో, బాధితురాలు న్యాయం కోసం అత్తింటి ముందు నిరసన దీక్షకు దిగింది.వివరాల్లోకి వెళితే.. వినుకొండ మండలం నడిగడ్డకు చెందిన గోపి లక్ష్మికి, వినుకొండ పట్టణానికి చెందిన కోటేశ్వరరావుతో ఈ ఏడాది జూన్ 4న వివాహం జరిగింది. వివాహ సమయంలో గోపి లక్ష్మి తల్లిదండ్రులు రెండు ఎకరాల పొలం అమ్మి రూ.12 లక్షల నగదు, 25 సవర్ల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. పెళ్లయిన రెండు నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది.ఆ తర్వాత అసలు వేధింపులు మొదలయ్యాయి. భర్త కోటేశ్వరరావు "నల్లగా ఉన్నావు" అంటూ హేళన చేయడం ప్రారంభించాడు. అత్తమామలు వెంకటేశ్వర్లు, శేషమ్మ కూడా అదనపు కట్నం తేవాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఈ విషయంపై పెద్దమనుషులతో మాట్లాడించినా ఫలితం లేకపోయింది. చివరికి ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేశారు.దీంతో తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గోపి లక్ష్మి తన అత్తింటి ముందు ఆందోళన చేపట్టారు. ఆమె నిరసన తెలుపుతుండగానే ఇంట్లోవాళ్లు తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa