టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా, నటి సప్నా గిల్ మధ్య నడుస్తున్న వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. తనపై సప్నా గిల్ పెట్టిన లైంగిక వేధింపుల కేసు పూర్తిగా అవాస్తవమని, కేవలం తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని పృథ్వీ షా ముంబైలోని దిండోషి సెషన్స్ కోర్టుకు తెలిపాడు. సప్నా గిల్ దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్ను కొట్టివేయాలని కోరుతూ పృథ్వీ షా తన వివరణను కోర్టుకు సమర్పించాడు.2023 ఫిబ్రవరి 15న జరిగిన ఘటనల క్రమాన్ని పృథ్వీ షా తన సమాధానంలో వివరించాడు. ముంబైలోని సహారా స్టార్ హోటల్లో తాను, తన స్నేహితుడు ఆశిష్ యాదవ్ భోజనం చేస్తుండగా, శోభిత్ ఠాకూర్ అనే వ్యక్తి సెల్ఫీ కోసం వచ్చాడని తెలిపాడు. మర్యాదపూర్వకంగా ఒక సెల్ఫీకి అంగీకరించినప్పటికీ, మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి పదేపదే సెల్ఫీల కోసం వేధించాడని, నిరాకరించడంతో దురుసుగా ప్రవర్తించాడని పేర్కొన్నాడు. దీంతో హోటల్ సిబ్బంది అతడిని బయటకు పంపించారని పృథ్వీ షా వివరించాడు.అనంతరం తాము హోటల్ నుంచి బయటకు వచ్చి కారులో వెళుతుండగా, అదే వ్యక్తి బేస్బాల్ బ్యాట్తో తమ కారు విండ్షీల్డ్పై దాడి చేశాడని ఆరోపించాడు. ఆ తర్వాత సప్నా గిల్, ఆమె స్నేహితులు తమను వెంబడించి ఓషివారా పోలీస్ స్టేషన్ వద్ద అడ్డగించారని తెలిపాడు. రూ. 50,000 ఇవ్వకుంటే లైంగిక వేధింపుల కేసు పెడతానని సప్నా గిల్ బెదిరించినట్లు పిటిషన్లో పేర్కొన్నాడు.ప్రచారం, డబ్బు కోసమే సప్నా గిల్ ఈ తప్పుడు కేసు పెట్టిందని, తాము ముందుగా ఆమెపై దాడి, బెదిరింపుల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, దానికి ప్రతీకారంగానే ఆమె ఈ ఫిర్యాదు చేసిందని పృథ్వీ షా వాదించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa