ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దశాబ్దాల నా కీర్తిని దెబ్బతీస్తున్నారని గంగూలీ ఆవేదన

sports |  Suryaa Desk  | Published : Fri, Dec 19, 2025, 08:29 AM

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోల్‌కతా సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఓ వ్యక్తిపై గురువారం ఆయన ఫిర్యాదు చేశాడు. అర్జెంటినా ఫుట్‌బాల్ ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ సాహా అనే వ్యక్తి తనపై నిరాధారమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని గంగూలీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ అయిన లాల్‌బజార్‌కు గంగూలీ ఈ-మెయిల్ ద్వారా ఈ ఫిర్యాదును పంపాడు. ఉద్దేశపూర్వకంగానే సదరు వ్యక్తి తనపై తప్పుడు, హానికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనివల్ల తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని ఆవేదన వ్యక్తంచేశాడు. దశాబ్దాల పాటు క్రీడాకారుడిగా, క్రీడా నిర్వాహకుడిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తాను సంపాదించుకున్న కీర్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ నెల 13న కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాల్గొన్న ఓ కార్యక్రమం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో తీవ్ర గందరగోళం చెలరేగి, అభిమానులు స్టేడియంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాను అరెస్టు చేయగా, క్రీడల మంత్రి ఆరూప్ బిశ్వాస్ తన పదవికి రాజీనామా చేశారు.ఈ నేపథ్యంలో, ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాతో సౌరవ్ గంగూలీకి సంబంధాలున్నాయంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఈ అసత్య ప్రచారంపైనే గంగూలీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గంగూలీ ఫిర్యాదును స్వీకరించిన సైబర్ సెల్ అధికారులు, దీనిపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa