ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్.. ఐపీఎల్ 2026 కోసం తన హనీమూన్ను వాయిదా వేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తన పెళ్లి కారణంగా సీజన్లో కొద్ది మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటానని చెప్పడంతో పంజాబ్ కింగ్స్ అతడిని వేలానికి విడుదల చేసింది. అయితే, వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతడిని అనూహ్యంగా రూ.8.6 కోట్లకు కొనుగోలు చేయడంతో ఇప్పుడు తన ప్రణాళికలను మార్చుకోవాలని ఇంగ్లిస్ భావిస్తున్నట్లు సమాచారం.క్రిక్బజ్ కథనం ప్రకారం ఏప్రిల్ 18న ఇంగ్లిస్ వివాహం జరగనుంది. పెళ్లి తర్వాత వెంటనే హనీమూన్కు వెళ్లాల్సి ఉండటంతో అతను ఐపీఎల్కు దూరమవుతాడని పంజాబ్ భావించింది. కానీ, వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ అతని కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు లక్నో భారీ ధరకు దక్కించుకుంది. ఇంగ్లిస్ లభ్యతపై పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ కంటే ఎల్ఎస్జీ కోచ్ జస్టిన్ లాంగర్, డైరెక్టర్ టామ్ మూడీ, అలాగే ఎస్ఆర్హెచ్ కోచ్ డేనియల్ వెటోరి, కెప్టెన్ పాట్ కమిన్స్లకు మెరుగైన అవగాహన ఉందని ఈ కథనం పేర్కొంది.ఈ విషయంపై సన్రైజర్స్ బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వల్ల అతను దూరమవుతాడని మాకు తెలుసు. కానీ వేలం తర్వాత నిర్ణయాలు మారొచ్చు. వెటోరికి ఇంగ్లిస్తో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి, మరికొన్ని అదనపు మ్యాచ్లు ఆడేలా ఒప్పించగలడని మేము భావించాము అని తెలిపారు.భారీ ధర పలకడంతో ఇంగ్లిస్ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందని ఓ వర్గం క్రిక్బజ్తో చెప్పింది.ఇప్పుడు అతనికి ఇంత పెద్ద మొత్తం లభించింది కాబట్టి, సీజన్ ప్రారంభంలోనే జట్టుతో చేరి, పెళ్లి కోసం చిన్న విరామం తీసుకుని, వెంటనే తిరిగి వచ్చే అవకాశం ఉంది అని పేర్కొంది.కాగా, ఇంగ్లిస్ తీరుపై పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియా అసంతృప్తి వ్యక్తం చేశారు. "జోష్ చివరి నిమిషంలో మాకు సమాచారం ఇచ్చాడు. రిటెన్షన్ గడువుకు 45 నిమిషాల ముందు ఫోన్ చేసి, పెళ్లి కారణంగా కొన్ని వారాలు మాత్రమే అందుబాటులో ఉంటానని చెప్పడం వృత్తిధర్మానికి విరుద్ధం. మేం అతడిని రిటైన్ చేసుకోవాలని అనుకుంటున్న విషయం తెలిసి కూడా అలా చేయడం సరికాదు" అని 'ది హిందూ'కు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa