ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోహిత్ శర్మను దాటేసిన ట్రావిస్ హెడ్.. ఒక్క సెంచరీతో ఇన్ని రికార్డులా

sports |  Suryaa Desk  | Published : Fri, Dec 19, 2025, 11:13 PM

ఆస్ట్రేలియా వేదికగా ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా మధ్య యాషెస్ టెస్ట్ సిరీస్ 2025-26 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడుతున్నాడు. సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అడిలైడ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో.. హెడ్ మెరుపు సెంచరీతో అద్భుత ప్రదర్శన చేశాడు. తన హోమ్ గ్రౌండ్ అడిలైడ్ ఓవల్‌లో.. రఫ్పాడించాడు. ఈ క్రమంలో 146 బంతుల్లోనే తన 11వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమ్ఇండియా స్టార్ రోహిత్ శర్మ రికార్డును అధిగమించాడు. కాగా, మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. దీంతో మొత్తంగా 356 అధిక్యంలో నిలిచింది. ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీ (52) క్రీజులో ఉన్నారు.


 తన అద్భుత సెంచరీతో రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్ చేశాడు ట్రావిస్ హెడ్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్ల లిస్టులో రోహిత్ శర్మ మందుండేవాడు. రోహిత్ మొత్తం 9 సెంచరీలు చేశాడు. ఇప్పుడా రికార్డును 10వ సెంచరీ బాది ట్రావిస్ హెడ్ అధిగమించాడు. కాగా, డబ్ల్యూటీసీలో అత్యధిక సెంచరీల రికార్డు ఇంగ్లాండ్ దిగ్గజం జో రూట్ పేరిట ఉంది. అతడు 22 సెంచరీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. రూట్ తర్వాత స్టీవ్ స్మిత్ 13 సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. కేన్ విలియమ్సన్, మార్నస్ లబుషేన్ చెరో 11 సెంచరీలు సాధించగా.. శుభ్‌మన్ గిల్, ట్రావిస్ హెడ్.. డబ్ల్యూటీసీలో 10 సెంచరీలు చొప్పున నమోదు చేశారు.


ఓవల్‌లో హెడ్ రికార్డులు..


కాగా, రోహిత్ శర్మను దాటేయడమే కాకుండా.. మరికొన్ని రికార్డులు సృష్టించాడు ట్రావిస్ హెడ్. అడిలైడ్ ఓవల్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన మూడో ప్లేయర్‌గా ఆసీస్ దిగ్గజాలు డేవిడ్ వార్నర్, అలన్ బోర్డర్, డేవిడ్ బూన్ సరసన నిలిచాడు. అలాగే ఈ గ్రౌండ్‌లో హెడ్‌కు ఇది నాలుగో టెస్టు సెంచరీ. ఈ జాబితాలో హెడ్ కంటే ముందు 7 సెంచరీతో మైఖేల్ క్లార్క్, 6 శతకాలతో రికీ పాంటింగ్ ముందున్నారు. ఇక ఆస్ట్రేలియాలోని ఒకే వేదిక‌లో వ‌రుస‌గా నాలుగు టెస్టు సెంచ‌రీలు చేసిన ఐదో ప్లేయ‌ర్‌ కూడా ట్రావిస్ హెడ్ నిలవడం గమనార్హం.


మరోవైపు, ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ వెథరాల్డ్ (1) విఫలమయ్యాడు. దీంతో ఆస్ర్టేలియా ఆదిలోనే షాక్ తగిలినట్లు అయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్ (13) కూడా ఎక్కువసేపు తేలిపోయాడు. ఈ సమయంలో ట్రావిస్ హెడ్‌, ఉస్మాన్ ఖవాజా(40) స్కోరు బోర్డును కాస్త పరుగులు పెట్టించారు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. హెడ్ మాత్రం ఏ మాత్రం తడబడకుండా ఇంగ్లాండ్ చెమటలు పట్టించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేయగలిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa