ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

national |  Suryaa Desk  | Published : Sat, Dec 20, 2025, 02:49 PM

దేశంలో సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌)పై జరుగుతున్న చర్చకు మరింత స్పష్టతనిస్తూ అలహాబాద్ హైకోర్టు రెండు కీలక తీర్పులను వెలువరించింది. అవివాహితులైన మేజర్లు కలిసి జీవించడం చట్టవిరుద్ధం కాదని, వారి ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని తేల్చిచెప్పింది. అదే సమయంలో, మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరొకరితో సహజీవనం చేయడం నేరమని, అటువంటి వారికి రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వేర్వేరు తీర్పులను ఇచ్చింది.తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ సహజీవనం చేస్తున్న 12 మంది అవివాహిత మహిళలు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం, వారికి తక్షణమే భద్రత కల్పించాలని సంబంధిత జిల్లాల పోలీసు అధికారులను ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "సహజీవనం అనే భావన అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు, కానీ దాన్ని చట్టవ్యతిరేకమని చెప్పలేం. మేజర్లయిన ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు వారి నిర్ణయాన్ని ప్రశ్నించడం కోర్టుల పని కాదు. వివాహం చేసుకోలేదన్న కారణంతో రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును నిరాకరించలేం" అని ధర్మాసనం పేర్కొంది. సహజీవనాన్ని మన సమాజం ఇంకా పూర్తిగా ఆమోదించలేదని, కొందరికి ఇది అనైతికంగా అనిపించవచ్చని కోర్టు అంగీకరించింది. అయితే, పాశ్చాత్య భావాలను స్వీకరించడానికి భారతదేశం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కూడా అలాంటిదేనని వ్యాఖ్యానించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa