ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ,.. ఆ ఘనత సాధించిన మొట్టమొదటి ప్లేయర్‌గా

sports |  Suryaa Desk  | Published : Sun, Dec 21, 2025, 10:40 PM

బే ఓవల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌- వెస్టిండీస్‌ మూడో టెస్టు మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్లు జోరు కొనసాగించారు. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌ను న్యూజిలాండ్‌ 575/8 వద్ద డిక్లేర్‌ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే విధ్వంసం సృష్టించాడు. 367 బంతుల్లో (227) డబుల్ సెంచరీ బాదాడు. రెండో ఇన్నింగ్స్‌లోని న్యూజిలాండ్ బ్యాటర్లు అదరగొట్టగా.. డెనాన్ కాన్వే (100) మరోసారి శతక్కొట్టాడు. దీంతో టెస్ట్ చరిత్రలో అతి కొద్ది మంది ప్లేయర్లకు ఉన్న అరుదైన ఘనత సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసిన ఈ ప్లేయర్ ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం గమనార్హం.


  న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో ఒకే టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో పాటు శతక ప్రదర్శన చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు డెవాన్ కాన్వే. అంతేకాకుండా అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 10వ ప్లేయర్‌గా నిలిచాడు. బ్రియాన్ లారా, గ్రహమ్ గూచ్, కుమార సంగక్కర, మర్నస్ లబుషేన్, శుభ్మన్ గిల్ వంటి ఆటగాళ్ల ఎలైట్ గ్రూప్‌లో చేరాడు డెవాన్ కాన్వే. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే ప్రదర్శన.. న్యూజిలాండ్ జట్టు మ్యాచ్‌పై పట్టు సాధించడంలో కీలక పాత్ర పోషించింది.


రెండో ఇన్నింగ్స్‌లో చేసిన సెంచరీ టెస్టుల్లో డెవాన్ కాన్వేకు ఏడోది. ఇది న్యూజిలాండ్‌ జట్టులో అత్యంత విశ్వసనీయ ప్లేయర్లలో ఒకరిగా అతడి ఖ్యాతిని మరింత పెంచింది. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్ తర్వాత కాన్వే పెవిలియన్ చేరాడు. పుల్ షాట్ ప్రయత్నించి.. డీప్ మిడ్-వికెట్‌ను ఎంచుకున్నాడు. బంతి నేరుగా జేడెన్ సీల్స్ చేతుల్లోకి వెళ్లింది. ఇక కాన్వేతో కలిసి బ్యాటింగ్ చేసిన టామ్ లాథమ్ (101) కూడా.. సెంచరీ సాధించిన కొద్దిసేపటికే అవుట్ అయ్యాడు. అయితే అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ప్లేయర్లుగా వీరిద్దరు రికార్డు సృష్టించారు.


రెండో ఇన్నింగ్స్‌లో వీరిద్దరితో పాటు విలియమ్సన్ (40), రచిన్ రవీంద్ర (46) స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో డిక్లేర్ చేయాలని కెప్టెన్ లాథమ్ నిర్ణయించుకున్నాడు. దీంతో చివరి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌కు 462 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది న్యూజిలాండ్. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 43 పరుగులు చేసింది. జాన్ క్యాంప్‌బెల్ (2) , బ్రాండన్ కింగ్ (37) క్రీజులో ఉన్నారు. విండీస్ ఇంకా 419 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, రెండో టెస్ట్ డ్రాగా ముగియడంతో న్యూజిలాండ్ 1-0 తేడాతో అధిక్యంలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa