ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐసీసీ ప్రీమియర్ స్పాన్సర్‌గా హ్యూందాయ్

sports |  Suryaa Desk  | Published : Tue, Dec 23, 2025, 11:02 PM

హ్యూందాయ్ మోటార్ కంపెనీని తమ ప్రీమియర్ పార్టనర్‌గా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. దీంతో 2026 నుంచి 2027 వరకు ఐసీసీ ఈవెంట్లకు ప్రీమియర్ పార్టనర్‌గా హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఉండనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ డీల్ కుదిరింది. ఈ కార్యక్రమానికి ఐసీసీ చైర్మన్ జై షా, ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా, హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ డిజిగ్నేట్ తరుణ్ గార్గ్ పాల్గొన్నారు. తాజా ఒప్పందంతో ఐసీసీకి ఉన్న నాలుగు ప్రీమియర్‌లో ఒకటిగా నిలిచింది హ్యూందాయ్. కాగా, ఐసీసీ ఇటీవల ఏబీ ఇన్‌బెవ్, శోభా రియాల్టీ, యూనిలీవర్, గూగుల్ వంటి బ్రాండ్‌లను స్పాన్సర్ల జాబితాలో చేర్చుకుంది.


ప్రీమియర్ పార్టనర్‌గా ఐసీసీ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో (మహిళలు, పురుషులు).. హ్యూందాయ్‌కి ప్రత్యేకమైన హక్కులు వస్తాయి. అంటే కాయిన్ టాస్, ఎక్స్‌టెన్సివ్ ఇన్ స్టేడియం బ్రాండింగ్, ప్రీమియం ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్ అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా ఇంటరాక్టివ్ ఫ్యాన్‌ జోన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. స్డేడియంలో ప్రేక్షకుల ముందు వాహనాలను ప్రదర్శించొచ్చు. అంతేకాకుండా డిజిటల్ ఎంగేజ్‌మెంట్ క్యాంపేయిన్స్ కూడా చేయొచ్చు. ఈ డీల్ కాలంలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026, పురుషుల వరల్డ్ కప్ 2027 సహా ఆరు ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లు జరగనుండటం గమనార్హం. వీటిని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 బిలియన్ల మంది ప్లేక్షులు వీక్షిస్తారని అంచనా. అంటే.. ఇంత మంది దగ్గరకు హ్యూందాయ్ తమ బ్రాండ్‌ను తీసుకెళ్లవచ్చు.


కాగా, ఇలాంటి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలతో పని చేయాలనే తమ లక్ష్యంలో భాగంగానే ఈ డీల్ కుదిరిందని ఐసీసీ ప్రకటించింది. ఈ డీల్‌ను ఐసీసీ ఛైర్మన్ జై షా స్వాగతించారు. గ్లోబల్ బ్రాండ్ అయిన హ్యూందాయ్ చాలా కాలంగా క్రీడలను ప్రోత్సహిస్తోందని.. ఇప్పుడు మా ఇద్దరి సామర్థ్యాలను కలిపి రాబోయే ఈవెంట్లను నిర్వహిస్తామన్నారు. ఇలా ఐసీసీతో భాగస్వామ్యం చేసుకోవడం, ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్లకు పైగా అభిమానులతో కనెక్ట్ అవ్వడం.. తమకు గౌరవంగా ఉందని హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ జోస్ మునోజ్ అన్నారు.


మరోవైపు, ఐసీసీ స్పాన్సర్‌షిప్స్ టైర్స్ వారీగా ఉంటాయి. టాప్ టైర్, సెకండ్ టైర్, కేటగిరీ పార్టనర్లు, అఫీషియల్ స్పాన్సర్లు ఉంటారు. టాప్ టైర్‌లో హ్యూందాయ్, ఎమిరేట్స్, అరాంకో, డీపీ వరల్డ్ ఉన్నాయి. ఇక రెండో టైర్‌లో కోకాకోలా (థమ్స్‌అప్, స్పైట్ కూడా), ఏబీ ఇన్‌బెవ్ (ముఖ్యంగా బడ్‌వైజర్), గూగుల్, యూనిలీవర్, శోభా రియాల్టీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఉన్నాయి. అంతేకాకుండా ఫ్యాన్‌క్రేజ్, నియర్, రాయల్ స్టాగ్‌కూడా ఐసీసీ స్పాన్సర్ల జాబితాలో ఉన్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa