ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బౌలర్లకు నిద్ర లేకుండా చేసిన అభిషేక్ శర్మ 45 సిక్సర్లు

sports |  Suryaa Desk  | Published : Sun, Dec 28, 2025, 09:58 PM

టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌, వరల్డ్‌ నంబర్‌వన్‌ టీ20 ప్లేయర్‌ అభిషేక్‌ శర్మ, వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌కు ముందు తన ఉద్దేశాలను మరోసారి గట్టిగా చాటాడు.ఎదురయ్యే ప్రతి బంతిని సిక్సర్‌గా మలచడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న అభిషేక్‌.. తన తాజా ప్రదర్శనతో క్రికెట్‌ వర్గాల్లో సంచలనం రేపాడు.ప్రస్తుతం పంజాబ్‌ జట్టు కెప్టెన్‌గా విజయ్‌ హజారే ట్రోఫీ ఆడుతున్న ఈ సిక్సర్ల సూపర్‌హీరో.. ఇవాళ (డిసెంబర్‌ 28) జైపూర్‌లోని అనంతం క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఏకంగా 45 సిక్సర్లు బాది అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ విషయాన్ని ట్రిబ్యూన్‌ మీడియాకు చెందిన రిపోర్టర్లు వెల్లడించారు.వారి కథనం ప్రకారం.. రేపు విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా పంజాబ్‌, ఉత్తరాఖండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన సాధనలో అభిషేక్‌ శర్మ బ్యాట్‌ మాట్లాడింది. ఎదుర్కొన్న దాదాపు ప్రతి బంతినీ భారీ షాట్‌గా మలుస్తూ ఏకంగా 45 సిక్సర్లు బాదాడు. ఈ దృశ్యం చూసిన రిపోర్టర్లు సహా అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు.ఇంత స్థాయి విధ్వంసం ఎప్పుడూ చూడలేదన్నట్లు అందరూ నోరెళ్లబెట్టారు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌ను అభిషేక్‌ ఊచకోత కోశాడు. ఆఫ్‌ బ్రేక్‌, లెగ్‌ బ్రేక్‌, స్లో లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్లపై ఎలాంటి కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు. దాదాపు ప్రతి బంతిని కవర్స్‌ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. ఈ విధ్వంసాన్ని చూసి పంజాబ్‌ కోచ్‌ సందీప్‌ శర్మ కూడా అవాక్కయ్యాడు.ట్రిబ్యూన్‌ రిపోర్టర్లు నివేదించిన ఈ కథనం చదివితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌలర్లకు భయం కలగడం ఖాయం.వాస్తవానికి అభిషేక్‌ సిక్సర్ల దండయాత్ర గతేడాది ఆరంభం నుంచే మొదలైంది. ఈ ఏడాది చివరికి అది తారాస్థాయికి చేరింది. 2024 ఐపీఎల్‌తో మెరుపులు మొదలుపెట్టిన అతను, అప్పటినుంచి ఎదురైన ప్రతి బౌలర్‌కు పరీక్షగా మారాడు.ఈ ఏడాది అతని సిక్సర్ల గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 41 టీ20 మ్యాచ్‌ల్లో ఏకంగా 108 సిక్సర్లు బాది, 2024లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. కరణ్‌బీర్‌ సింగ్‌ (ఆస్ట్రియా), నికోలస్‌ పూరన్‌ (వెస్టిండీస్‌) మాత్రమే అతనికంటే ముందున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa