రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ స్టేషన్లను కూడా పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేసినట్టుగా ఉందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపిన వైయస్ఆర్సీపీ నాయకులపై కేసులు నమోదు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతపురం జిల్లా వైయస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, న్యాయ విభాగం ప్రతినిధులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో రమేష్ గౌడ్ మాట్లాడారు. గుల్జార్పేటలో రోడ్డు విస్తరణ పనుల సందర్భంగా టీడీపీ జెండా దిమ్మెను తొలగించగా, అక్కడ ఉన్న వైయస్ఆర్సీపీ కార్పొరేటర్ కుమారుడు దాదును పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని తెలిపారు. దీనిపై దాదు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేయడంతో వైయస్ఆర్సీపీ ముఖ్య నాయకులంతా పోలీస్ స్టేషన్కు వెళ్లగా, స్టేషన్లోకి అనుమతించకుండా బయటే నిరసనకు దిగాల్సి వచ్చిందన్నారు.ఈ సందర్భంగా సీఐలు వ్యవహరించిన తీరుపై రమేష్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకరు “కాల్చిపారేస్తాం” అని బెదిరిస్తే, మరొకరు “200 మందిని దించుతాం” అంటూ హెచ్చరించడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. అసలు మేమేమైనా గుండాలమా, తీవ్రవాదులమా, సంఘవిద్రోహ శక్తులమా అని నిలదీశారు. విద్యార్థి దశ నుంచే అనేక ప్రజా ఉద్యమాలు చేశామని, ఢిల్లీలో కూడా నిరసనల్లో పాల్గొన్నామని, కానీ ఇంత అవమానకరంగా పోలీసులు ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు.ఈ సంఘటనలో దాదును ఎందుకు అదుపులోకి తీసుకున్నారో, ఎందుకు కేసులు నమోదు చేశారో పోలీసులు స్పష్టంగా చెప్పి ఉంటే అసలు వివాదమే ఉండేది కాదన్నారు. పోలీస్ స్టేషన్లు ప్రజల కోసమేనని, అన్యాయం జరిగినప్పుడు ప్రజలు అక్కడికే వస్తారని గుర్తుచేశారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa