ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జూపార్కు ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జూ పార్క్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. రాజానగరం అభయారణ్యంలో జూపార్కు ఏర్పాటు కోసం కేంద్ర బృందం పరిశీలన జరిపింది. ఢిల్లీ నుంచి బెన్ ఆధ్వర్యంలో వచ్చిన కేంద్ర బృందం రాజానగరం మండల పరిధిలోని దివాన్ చెరువు వద్ద ఉన్న అటవీ భూమిని పరిశీలించింది. ఎంపీ పురందేశ్వరితో పాటుగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా జూపార్కు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. 250 హెక్టార్లలో జూపార్కు ఏర్పాటుకు పరిశీలన జరిపినట్లు తెలిపారు. జూపార్కు ఏర్పాటుకు కేంద్రం కూడా సానుకూలంగా ఉందని ఎంపీ వివరించారు.
ఇందులో భాగంగానే కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిందని.. సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం త్వరలోనే కార్యాచరణ ప్రారంభించనున్నట్లు పురందేశ్వరి తెలిపారు. ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, అటవీ విస్తీర్ణం, పర్యావరణ అనుకూలతలపై కేంద్ర బృందం సభ్యులు పరిశీలన చేసినట్లు వివరించారు. మరోవైపు దివాన్ చెరువు పండ్లమార్కెట్, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మధ్యలో ఉన్న 700 ఎకరాల అటవీ భూమిలో జూపార్కు ఏర్పాటు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఇక్కడ తుప్పలు, చెట్లు తొలగించి కొంతమేరకు శుభ్రం చేశారు.
మరోవైపు రాజమండ్రిలో నగరవనం అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఫుడ్ కోర్టు, జిప్ లైన్ సౌకర్యాల ద్వారా పర్యాటకులను ఆకర్షించాలని భావిస్తోంది. నగరవనంతో పాటుగా ఈ జూపార్కు కూడా ఏర్పాటైతే.. రాజమహేంద్రవరం కొత్త శోభను సంతరించుకుంటుందని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాజమండ్రి జూపార్కును త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే రాజానగరంలో జూపార్కు ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం కేంద్ర బృందం ఈ ప్రాంతంలో పర్యటించింది. కేంద్ర బృందం నివేదిక అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa