తమిళనాడు ఎన్నికలకు ముందు.. ఆ రాష్ట్రంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గతేడాది జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో.. తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్కి తాజాగా సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈనెల 12వ తేదీన ఢిల్లీ విచారణకు హాజరు కావాలని.. సీబీఐ అధికారులు జారీ చేసిన నోటీసుల్లో ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో జరుగుతున్న ఈ స్వతంత్ర దర్యాప్తు ఇప్పుడు విజయ్ రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా మారింది.
2025 సెప్టెంబర్ 27వ తేదీన కరూర్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుని.. 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేసిన తమిళనాడు పోలీసులు.. టీవీకే అధినేత విజయ్పై కేసు నమోదు చేశారు. తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించిన విజయ్.. తన రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా కరూర్లోని వేలుసామిపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
అయితే ర్యాలీ నిర్వహించే ప్రాంతం చాలా ఇరుకుగా ఉండటం.. మధ్యాహ్నం రావాల్సిన విజయ్.. చాలా ఆలస్యంగా రాత్రి పూట రావడంతో.. అప్పటివరకు వేచి చూసిన ఫ్యాన్స్, పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా ఎగబడటంతో.. తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
కేవలం 10 వేల మందికి సరిపడా సామర్థ్యం ఉన్న ప్రదేశంలో సుమారు 30 వేల మందికి పైగా జనం గుమిగూడడం.. సరైన రక్షణ చర్యలు లేకపోవడం, విజయ్ రాక ఆలస్యం కావడం వల్ల తొక్కిసలాట జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ తొక్కిసలాట ఘటనపై మొదట తమిళనాడు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా విచారణ చేపట్టారు. అయితే.. పారదర్శకమైన దర్యాప్తు జరగాలని బాధితుల కుటుంబాలు కోరడంతో.. ఈ కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది.
దీంతో ఈ కరూర్ తొక్కిసలాట కేసును గతేడాది అక్టోబర్లో సీబీఐకి అప్పగిస్తూ.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్.. కరూర్ జిల్లా పార్టీ కార్యదర్శి మతియళగన్ వంటి కీలక నేతలను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇప్పుడు నేరుగా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ను ప్రశ్నించాలని నిర్ణయించింది.
విజయ్ స్పందన
అయితే ఈ కరూర్ తొక్కిసలాట ఘటనపై గతంలోనే విజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున.. గాయపడ్డ వారికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మమల్లాపురంలో బాధితుల కుటుంబాలను కలిసి వ్యక్తిగతంగా క్షమాపణలు కూడా చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa