రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా వైయస్ఆర్సీపీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్రంగా విమర్శించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేయాలనే దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణకు పూనుకుందని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో వైయస్ఆర్సీపీ గళం విప్పుతుందని స్పష్టం చేశారు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైయస్ఆర్సీపీ తరఫున ఫ్లోర్ లీడర్లు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మేము అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడేలా చట్టబద్ధ హామీలు బిల్లులో చేర్చితే మేము మద్దతు ఇస్తాం” అని స్పష్టం చేశారు. కానీ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తేల్చిచెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించిన ఆయన, అవసరమైన నిధులు కేటాయించకుండా రాయలసీమ ప్రజలను మోసం చేస్తోందన్నారు. రాష్ట్రం ప్రస్తుతం అప్పుల కుప్పగా మారిందని, నిర్దేశించిన అప్పుల పరిమితిని మించి 69 శాతం ఎక్కువగా అప్పులు చేశారని విమర్శించారు. అప్పుల ద్వారా తెచ్చిన నిధులు ఏ పనులకు ఖర్చు చేస్తున్నారో ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa