తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. మాజీ మంత్రి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నఉన్నత న్యాయస్థానం.. పిటిషన్ విచారణకు అంగీకరించింది. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్ల కింద తనపై కేసులు నమోదు చేశారని పిటిషన్లో అంబటి వివరించారు. ఈ కేసుల్లో కింద కోర్టు తనకు రిమాండ్ విధించిన విషయాన్ని హైకోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. తనపై పెట్టిన అన్ని కేసులను కొట్టివేసి, ఉపశమనం కల్పించాలని వైసీపీ నేత కోరారు. తనపై కేసులు చట్టవిరుద్దమని ఆయన తరఫున లాయర్ వాదించారు. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదిపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది.
కాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన నివాసంపై దాడిచేసి, ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యలపై అంబటి క్షమాపణలు చెప్పినా... టీడీపీ అభిమానులు ఆగ్రహం చల్లారలేదు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రిపై పోలీసులు కేసు నమోదుచేసి, అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.
ఇది ఇలా ఉండగా.., తన తండ్రి అరెస్ట్పై అంబటి మూడో కుమార్తె శ్రీజ తీవ్రంగా స్పందించారు. అమెరికాలో ఉన్న ఆమె ఓ వీడియో విడుదల చేసి.. తమ ఇంటిపై దాడి...తన తండ్రి అరెస్ట్ వెనుక కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారని, ఆయన డైరెక్షన్లోనే అన్నీ జరిగాయి అని శ్రీజ ఆరోపించారు. ‘మా ఇంటిలో 3 రోజుల కిందట పెద్ద గొడవ జరిగింది. అది ఎలా మొదలైంది అంటే.. మా నాన్న ( అంబటి రాంబాబు ) గుడికి వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా, కొంతమంది టీడీపీ వ్యక్తులు రాళ్లు పట్టుకొని, భౌతిక దాడులకు బెదిరించారు... ఒక మహిళ అసభ్య పదజాలంతో దూషించింది’ అని శ్రీజ అన్నారు.
‘నాయకుడిగా నేను సమతౌల్యం కోల్పోకూడా.. అలా మాట్లాడి ఉండకూడదు అని ఆవేదనను ఆయన నిజాయితీగా వివరించారు. చట్టపరమైన చర్యలను కూడా ఎదుర్కొంటానని చెప్పారు’అని ఆయన కుమార్తె శ్రీజ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసినప్పటికీ టీడీపీ నాయకులు సంతృప్తి చెందలేదని, వారికి వేరే అజెండాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. అందుకే రాత్రి 10 గంటల ప్రాంతంలో మా ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa