గతేడాది మేఘాలయకు హనీమూన్ కోసం తీసుకెళ్లి భర్తను ప్రియుడితో చంపించిన సోనమ్ గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. ఇప్పుడు ఇలాంటి ఘటనే మరో చోట జరిగింది. ముఖ్యంగా రాజస్థాన్లో అనేక అనుమానాలకు తావిచ్చిన 'హిట్ అండ్ రన్' కేసు చివరకు అత్యంత దారుణమైన కుట్రగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా నవ వధువే.. వాకింగ్ తీసుకెళ్లి మరీ తన భర్తను ప్రియుడితో చంపించినట్లు తేలింది. మేఘాలయలో గతంలో జరిగిన 'హనీమూన్ మర్డర్' తరహాలోనే ఈ ఘటన ఉండటంతో దీనిని 'రాజస్థాన్ హనీమూన్ మర్డర్ 2.0'గా పోలీసులు అభివర్ణిస్తున్నారు.
ప్రమాదం కాదు.. పక్కా ప్లాన్
జనవరి 30వ తేదీ రాత్రి రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ సమీపంలో ని రోడ్డుపై ఆశిష్, అంజు అనే దంపతులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే ఓ గుర్తుతెలియని వాహనం వచ్చి వారిని ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆశిష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆయన భార్య అంజు స్పృహ తప్పి పడిపోయింది. అయితే ఈ విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అలాగే అంజును లేపే ప్రయత్నం చేశారు. ఈక్రమంలోనే ఆమె స్పృహలోకి రాగా ఏం వచ్చిందని ఆరా తీశారు. అప్పటికే పోలీసులు కూడా రావడంతో.. అంజు జరిగింది చెప్పింది. ఎవరో వాహనంతో ఢీకొట్టి తన ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్లారని నమ్మబలికింది. ఈక్రమంలోనే తన భర్త ప్రాణాలు కోల్పోయాడని వివరించింది.
పోలీసులకు వచ్చిన అనుమానం ఎక్కడ?
కానీ పోలీసులకు అంజు మాటల్లో నిజం కనిపించలేదు. ఆమె ఏదో దాస్తోందని అనుమానం వచ్చింది. అది మాత్రమే కాకుండా ఆశిష్ శరీరంపై వాహనం ఢీకొట్టిన గాయాల కంటే కూడా ఎవరో గొంతు నులిమిన ఆనవాళ్లే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా భర్త అంత దారుణంగా చనిపోయినా.. పక్కనే ఉన్న అంజుకు కనీసం చిన్న గీత కూడా పడకపోవడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. వీటన్నింటితో ఆమెపై అనుమానం మరింత పెరగ్గా.. పోలీసులు ఆమెపై నిఘా పెట్టారు. ముఖ్యంగా కాల్ డేటాను పరిశీలించారు. ఈక్రమంలోనే తన ఇంటి పక్కనే ఉండే సంజు అనే పాత ప్రియుడితో నిరంతరం టచ్లో ఉన్నట్లు తేలింది. ఈక్రమంలోనే ఆమెను పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తానే ప్రియుడి కోసం ప్రియుడి చేతనే ఆశిష్ను చంపించినట్లు వివరించింది.
అసలేం జరిగిందంటే..?
మూడు నెలల క్రితమే అంజు, ఆశిష్లకు పెళ్లి కాగా.. పెళ్లయిన కొత్తలోనే భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది అంజు. అక్కడే తన పాత ప్రియుడు సంజుతో మళ్లీ బంధాన్ని తిరిగి ప్రారంభించింది. కానీ అప్పటికే ఆశిష్ వచ్చి ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లాడు. అయితే భర్త కంటే ప్రియుడే ఎక్కువగా నచ్చడంతో.. అతడితోనే కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంది. ఇదే విషయాన్ని సంజుకు కూడా చెప్పగా.. అతడు కూడా ప్రియురాలితోనే కలిసి జీవించేందుకు ఆసక్తి చూపించారు. అయితే నేను నీకు దక్కాలంటే ముందు నా భర్తను చంపాలని అంజు.. సంజుకు చెప్పగా అతడు కూడా అందుకు ఒప్పుకున్నాడు. ఇలా వీరిద్దరూ ఆశిష్ను చంపేందుకు పథకం వేశారు. ఇదీ చూడండి: విషాదంగా ముగిసిన హనీమూన్ జంట అదృశ్యం.. వరుడు దారుణ హత్య
ఈ పథకంలో భాగంగానే.. అంజు ప్రతిరోజూ రాత్రి భర్తను వాకింగ్కు తీసుకెళ్లేది. అలా జనవరి 30వ తేదీన కూడా.. అంజు ఆశిష్ను జనం లేని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ పొదల్లో నక్కి ఉన్న సంజు, అతని అనుచరులు రాకీ, బాదల్ ఒక్కసారిగా ఆశిష్పై దాడి చేశారు. అతని గొంతు నులిమి ప్రాణం తీసిన అనంతరం.. దానిని ప్రమాదంగా నమ్మించడానికి అంజు తన ఫోన్, నగలను నిందితులకు ఇచ్చేసి తాను కూడా రోడ్డుపై పడిపోయింది. కానీ అంజుకు గాయాలు కాకపోవడం, భర్త చావుతో ఏమాత్రం బాధ పడకపోవడంతో పోలీసలు నిజాన్ని గుర్తించారు. అంజు చేతే అన్ని విషయాలు చెప్పించి.. ఆమెతో పాటు ఆమె ప్రియుడు, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa