తానెప్పుడూ కుల మతాల గురించి ఆలోచించనని, కుల మతాలపై రాజకీయాలు చేస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. తన పోరాటం వ్యక్తులపై కాదన్న జనసేనాని... భావాలపైనే తాను పోరాటం చేస్తానని తెలిపారు. 2014లో మార్పు కోసం బయటకు వచ్చానన్న పవన్... తానేదో 9 నెలల్లోనే అధికారం చేజిక్కించుకుంటానని పార్టీ పెట్టలేదని తెలిపారు. ఈ కారణంగానే తన ప్రయాణం పాతికేళ్ల ప్రస్థానం అని తాను చెప్పానని ఆయన వెల్లడించారు. వారసత్వ రాజకీయాలకు కొంతవరకైనా అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఉందని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలల ప్రస్తావనను తీసుకొచ్చారు. అన్న పట్టించుకోలేదని చెల్లి మరో పార్టీ పెట్టిందని పవన్ ఎద్దేవా చేశారు.
జనసేన ప్రారంభించిన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శనివారం ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని సిద్ధవటం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రచ్చబండలో ఆయన జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డ 173 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున రూ.1.73 కోట్లను పంపిణీ చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
రాయలసీమ చదువుల నేల అన్న పవన్... పద్యం పుట్టిన నేలలో ఇప్పుడు మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు. ఉపాధి అవకాశాలు లేకుంటే యువత ఏం చేయాలని ప్రశ్నించిన పవన్... ఇంటింటికీ చీప్ లిక్కర్ వచ్చిందని యువతే చెబుతున్నారని అన్నారు. ఎవరి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న పవన్.. కౌలు రైతులకు కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయకుంటే... ఏపీకి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేరుగానే టార్గెట్ చేసిన పవన్... సొంత బాబాయిని చంపిన వారిని ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. కోడి కత్తితో తనపై దాడి జరిగితే ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదంటూ గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు. ఇప్పుడు జగనే సీఎం కదా... ఏపీ పోలీసులపై జగన్కు ఎందుకు నమ్మకం లేదని నిలదీశారు. ఎంతకాలం దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తారో తానూ చూస్తానని పవన్ వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే వ్యవస్థలను బాగు చేస్తామని పవన్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa