ఆ ఇద్దరు స్నేహితులు ఎంతో ఆనందంగా ఇంటి నుంచి బయల్దేరారు. కళాశాలకు వెళ్లి రుసుము చెల్లించారు. తర్వాత మిత్రుడ్ని చూద్దామని బయల్దేరి వెళ్తుండగా మార్గమధ్యలో మృత్యువు కాటేసింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భోగాపురం ఎస్సై మహేష్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస 16వ వార్డుకు చెందిన కింతల రమేష్, వాణిల చిన్న కుమారుడు అభిషేక్ (23) శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు.
అతనితో పాటు స్నేహితుడు వై.గౌతమ్తో కలసి ఫీజు చెల్లించేందుకు ఇంటి నుంచి కళాశాలకు బయల్దేరారు. ఇద్దరూ ఫీజు చెల్లించిన తరువాత విశాఖలోని మిత్రుడ్ని కలిసేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. భోగాపురం హైవే వంతెన వద్ద ఆగి ఉన్న లారీ పక్క నుంచి వెళ్తున్న సమయంలో అభిషేక్ వాహనానికి అడ్డంగా కుక్క రావడంతో ప్రమాదవశాత్తు కదులుతున్న అదే లారీని బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో బండి కింద పడ్డ కుక్క చనిపోగా.. అభిషేక్ తలకు బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయాడు. వెనుక కూర్చున్న గౌతమ్ ఎడమచేతికి గాయమవ్వడంతో 108 సిబ్బంది సుందరపేట ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa