ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ.ఆర్.కానిస్టేబుల్ ప్రకాష్ సస్పెన్షన్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పై కేసు నమోదైంది. ఎస్పీతో పాటు, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్ బాషాలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్పీ, ఇతర పోలీసులపై అనంతపురం టూటౌన్ పీఎస్లో కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదు చేయడంతో కేసు ఫైల్ చేశారు. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ను సర్వీస్ నుంచి ఎస్పీ ఫకీరప్ప డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. కానిస్టేబుల్పై ఐదు క్రిమినల్ కేసులు ఉండటంతో పోలీసు ఉన్నతాధికారుల కఠిన చర్యలు తీసుకున్నారు. తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై లిఖితపూర్వకంగా ప్రకాష్ ఫిర్యాదు చేశారు.
దళితుడిననే చిన్నచూపుతో కుట్రపూరితంగా తనపై తప్పుడు విచారణ వాంగ్మూలం రికార్డు చేశారని ప్రకాష్ అంటున్నారు. ఇందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. అనంతపురం టూటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.గార్లదిన్నె పోలీస్స్టేషన్లో 2019లో తనపై నమోదైన ఓ కేసు కోర్టులో నడుస్తుండగానే.. పోలీసు శాఖ విచారణ చేపట్టింది అన్నారు. ప్రస్తుత సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషా, ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, సీఐలు కృష్ణారెడ్డి, విజయభాస్కర్గౌడ్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది అన్నారు.
బాధితురాలు లక్ష్మి కానిస్టేబుల్ ప్రకాష్కు రూ.10 లక్షల డబ్బులు, బంగారం ఇవ్వలేదని చెప్పినా విచారణాధికారులు ఆమె వాంగ్మూలాన్ని మార్చేశారని ప్రకాష్ అంటున్నారు. నేరం రుజువైందని వారే నిర్ణయించుకుని తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఫిర్యాదు చేశారు. కుట్ర ఆలోచనతో, తాను దళితుడిననే కారణంతో ఉద్యోగం నుంచి తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రకాష్ పోలీస్ క్వార్టర్ ఖాళీ చేయాలంటూ మంగళవారం నోటీసు ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa