ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వార్తల్లో వాస్తవం లేదు...ఏపీ బీజేపీ కో ఇంఛార్జ్ సునీల్ ధియోదర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 31, 2022, 08:07 PM

ఎన్డీయేలో టీడీపీ చేరబోతున్నట్లు వస్తున్నవార్తల్లో నిజంలేదని ఏపీ బీజేపీ కో ఇంఛార్జ్ సునీల్ ధియోదర్ స్పష్టంచేశారు. ఇదిలావుంటే టీడీపీ మరోసారి ఎన్డీఏలో చేరబోతోందా.. కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చ ఇది. కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని ప్రస్తావించాయి. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కమిటీ సమావేశం జరిగిన సమయంలో ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీతో చంద్రబాబు కరచాలనం చేసి.. ఐదు నిమిషాలు ముచ్చటించారు. దీంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ అంశాన్ని ప్రస్తావించి ఎన్డీఏలో టీడీపీ చేరబోతోందని ప్రచారం జరుగుతోంది.


ఈ ప్రచారంపై ఏపీ బీజేపీ కో ఇంఛార్జ్ సునీల్ ధియోదర్ స్పందించారు. టీడీపీ ఎన్డీఏతో కలవబోతోందన్న ప్రచారంలో నిజం లేదని కొట్టిపారేశారు. బీజేపీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డ్ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ చంద్రబాబును మాత్రమే కాదని.. చాలామంది నేతల్ని కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో రెండు కుటంబ పార్టీలు, అవినీతి పార్టీలు అంటూ విమర్శించారు.


2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేసాయి.. ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. ఏపీలో బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించగా.. టీడీపీ కూడా కేంద్ర కేబినెట్‌లో చేరింది. ఆ తర్వాత పరిణామాలతో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది.. ఏపీ కేబినెట్ నుంచి బీజేపీ మంత్రులు బయటకు వచ్చారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయింది. అప్పుడు టీడీపీ రాజకీయ అవకాశవాదానికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. అయితే ఇటీవల జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం.. ప్రధాని మోదీ చంద్రబాబును కలవడంతో టీడీపీ ఎన్డీఏతో చేరబోతుందనే ప్రచారం జరుగుతోంది. కానీ అలాంటిదేమీ లేదని సునీల్ ధియోదర్ అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa