ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెప్టెంబర్ 1 నుంచి బయోమెట్రిక్: విడదల రజిని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 31, 2022, 09:45 PM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెప్టెంబర్ 1 నుంచి బయోమెట్రిక్ హాజరు అమల్లోకి తీసుకొస్తున్నట్టు మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ విధానం పక్కాగా అమలు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. అలాగే, అర్హులైన ప్రజలకు ఆరోగ్యశ్రీ  ద్వారా వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఆయుష్ డిస్పెన్సరీలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశాలు జారీచేశారు. మంగళవారం నిర్వహించిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 


త్వరలోనే ఫ్యామిలీ డాక్టర్ విధానం అమల్లోకి తీసుకురానున్నట్టు మంత్రి పునరుద్ఘాటించారు. ‘‘కుటుంబ వైద్యుల విధానం అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇంటింటికీ వైద్య సేవలు అందిస్తుంది.. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను విజయవంతంగా అమలు చేసేందుకు కొత్తగా 176 మంది వైద్యాధికారులు, 1,681 మంది మిడ్-లెవెల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించనున్నాం.. వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్‌లలో 65 రకాల మందులను అందుబాటులో ఉంచాం... ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయడానికి అన్ని స్థాయిల సిబ్బందికి ప్రత్యేక యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.. ఎంఎంయూ వాహనాలు 45 రోజుల్లో సిద్ధంగా ఉంటాయి’’అని మంత్రి రజనీ నొక్కి చెప్పారు.


వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతూ.. ఫేస్ రికగ్నిషన్ యాప్‌పై కసరత్తు చేస్తున్నామని, ప్రత్యేకించి ఫీల్డ్‌లో పని చేస్తున్న సిబ్బందికి దీని ద్వారా అటెండెన్స్ అవకాశం కల్పిస్తామని తెలిపారు. అయితే, హాస్పిటల్స్, ఆఫీసులు, మెడికల్ కాలేజీల్లో పని చేసే వారికి మాత్రం బయో మెట్రిక్ విధానంలో అటెండెన్స్ ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు, బయోమెట్రిక్ హాజరు విధానం వల్ల ఆస్పత్రుల్లో వైద్యులు పనితీరు మెరుగుపడిందని కృష్ణబాబు చెప్పారు.


‘బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వైద్యుల పనితీరు మెరుగుపడింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే చర్యలు తీసుకుంటాం.. కర్నూలు టీచింగ్ హాస్పిటల్ నుంచి వైద్యులపై ఫిర్యాదులు అందాయి.. ఈ అంశంపై దృష్టి పెట్టాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్‌కు అదేశాలిచ్చాం.. వైద్యారోగ్య శాఖలో సిబ్బందికి ఫేస్ రికగ్నైషన్ యాప్ ఆలోచన లేదు.’’ అని కృష్ణబాబు స్పష్టం చేశారు.


స్పెషలిస్టుల కొరత తీర్చేందుకు ఏడాది పాటు పీజీ విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ చేసేలా త్వరలో ఆదేశాలు వెలువరించనున్నట్టు కృష్ణబాబు వెల్లడించారు. సీహెచ్సీ , ఏరియా హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ చికిత్సలు పెరుగుతున్నాయని.. వచ్చే రెండేళ్లలో ప్రయివేట్‌కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తామని కృష్ణబాబు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa