ఉమ్మడి రాష్ట్రంలో వెలుగు చూసిన ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో కీలక ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదంటూ తెలంగాణ హైకోర్టుకు వెళ్లి తనకు అనుకూలంగా ఉత్తర్వులు పొందిన కోనేరు మధుకు తాజాగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోనేరు మధుకు ఈ కేసుతో ప్రమేయం ఉందని వాదించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు... ఆయనకు నోటీసులు జారీ చేసింది.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు రాజేంద్రప్రసాద్ను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా 9 నెలల పాటు జైల్లో ఉన్న ఆయన నాటి ఉమ్మడి ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. ఈ సమయంలోనే ఈ కేసులో రాజేంద్రప్రసాద్ కుమారుడు కోనేరు మధుకు కూడా ప్రమేయం ఉందంటూ ఈడీ కేసు నమోదు చేసింది. అంతేకాకుండా విచారణకు హాజరు కావాలంటూ మధుకు నోటీసులు కూడా జారీ చేసింది.
ఈడీ కేసు, సమన్లపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మధు.. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని వాదించారు. ఈ కేసుపై విచారణ పూర్తి చేసిన తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జులైలో ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈడీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు... కోనేరు మధుకు నోటీసులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa