తాజాగా టీటీడీ శ్రీవారి భక్తులకు ఓ విన్నపం చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని.. కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేసింది. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
మరోవైపు తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 7 సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది. ఆలయంలో యాత్రికుల వల్లగానీ.. సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 8న పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 9న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 10న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750/- చెల్లించి గృహస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 6న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని పురస్కరించుకుని కల్యాణోత్సవం, ఊంజల్సేవ, సెప్టెంబరు 7న అంకురార్పణం సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్సేవను రద్దు చేశారు.
సెప్టెంబరు 8న పవిత్రోత్సవాల్లో మొదటిరోజు తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, సెప్టెంబరు 9న రెండో రోజు అభిషేకానంతర దర్శనం, బ్రేక్ దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, సెప్టెంబరు 10న పవిత్రోత్సవాల్లో చివరిరోజు ఉదయం సామవేద పుష్పాంజలి, బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, ఊంజల్సేవను టిటిడి రద్దు చేసింది. మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహిస్తారు.
అనంతరం ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 10 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa