ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోని ఓ నేత తనపై చేసిన ఆరోపణలపై తీవ్రస్థాయిలో స్పందించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న నారాయణస్వామి.. పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కుట్రంతా గంగాధర నెల్లూరు మండలంలో మాత్రమే జరుగుతోందన్నారు. ఆరోపణలు చేసిన నేత పేరు ప్రస్తావించని నారాయణ స్వామి.. తనను అవమానించిన విషయం తెలిస్తే ఏమవుతుందో తెలియటం లేదంటూ సదరు నేతకు హెచ్చరికలు జారీ చేశారు. అవినీతి చేశానని నిరూపిస్తే.. వాళ్ల కాళ్లు పట్టుకునేందుకు కూడా సిద్ధమేనని తెలిపారు. ఇలాంటి ఆరోపణల వల్ల భవిష్యత్తులో సీఎం జగన్కు తనపై నిజంగానే కోపం వచ్చే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
'నాపై ఆరోపణలు చేసిన మహానుభావుడి పేరు చెప్పను కానీ.. నన్ను అవమానించిన విషయం చెబితే ఏమవుతుందన్నది ఆయనకు తెలియటం లేదు. ఆయనకు నేనేదో అన్యాయం చేశానని చెబుతున్నారు. నేను ఒక్క రూపాయి తీసుకున్నట్టు కానీ.. అవినీతి చేసినట్టు కానీ.. అన్యాయం చేసినట్టు కానీ.. ఆయనైనా లేదా అతని అనుచరుల్లో ఏ ఒక్కరైనా నిరూపిస్తే వాళ్ల కాళ్లకు దండం పెట్టేందుకు కూడా సిద్ధమే. ఆ మహానుభావుడే గతంలో నేను ఎస్సీగా పుట్టి ఉంటే బాగుండేది.. నాకూ ఓ పదవి దక్కేదంటూ వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తిని నమ్ముకుని ఆయన వెంట ఉండే కార్యకర్తలు మోసపోవద్దు. ఆయన మాటలు నమ్మి పార్టీకి, కుటుంబానికి మోసం చేయద్దు. పార్టీకి అన్యాయం చేసేవాళ్లు పార్టీని వీడిపోవాలి.' అంటూ నారాణయ స్వామి సొంత పార్టీ నేతపై విమర్శలు గుప్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa