ఓ కేసులో పోలీసులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డ ఏపీ హైకోర్టు ఈ విషయంలో డీజీపీ హాజరై వివరణ ఇవ్వాలని సూచించింది. ఏపీ హైకోర్టు మరోమారు రాష్ట్ర పోలీసు శాఖ బాస్ (డీజీపీ)ని విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా పోలీసు అధికారులు నిబంధనలు పాటించడం లేదన్న పిటిషన్ వాదనలతో స్పందించిన హైకోర్టు తదుపరి విచారణకు డీజీపీ హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. పోలీసు అధికారులు నిబంధనలకు అనుగుణంగా ఎందుకు పనిచేయడం లేదన్న విషయాన్ని వివరించాలని డీజీపీని కోర్టు ఆదేశించింది.
రైస్ మిల్లర్లు, వాహనదారులను రేషన్ బియ్యం పేరుతో పోలీసు అధికారులు వేధిస్తున్నారంటూ కర్నూలుకు చెందిన సౌదామిని రైస్ మిల్లు యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రేషన్ బియ్యం పేరిట నిత్యం తనిఖీలు చేస్తూ పోలీసులు మిల్లర్లతో పాటు వాహనదారులను వేధిస్తున్నారని ఆ సంస్థ తన పిటిషన్లో హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. తనకు చెందిన మిల్లులో సోదాలు చేసిన పోలీసులు 5 వాహనాలను సీజ్ చేశారని, దీనిపై కేసు పెట్టిన పోలీసులు... సదరు విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికే తీసుకురాలేదని తెలిపింది. ఇదంతా చూస్తుంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వేధింపులకు దిగుతున్నారని అర్థమవుతోందని వివరించింది.
ఈ పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు... పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రవితేజ.. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసుల తీరుపై జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని తెలిపారు. ఈ వాదనలు విన్న తర్వాత హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు డీజీపీ హాజరై.. పోలీసులు నిబంధనలు ఎందుకు పాటించడం లేదన్న విషయంపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa