ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదల స్థితిగతులపై దృష్టి సారించండి...కేంద్రంపై మండిపడ్డ ఆర్ఎస్ఎస్ నేత

national |  Suryaa Desk  | Published : Tue, Oct 04, 2022, 12:04 AM

దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతోందని, 20 కోట్ల మంది పేదల స్థితిగతులపై దృష్టి సారించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే సూచించారు. అయితే, గడచిన కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆర్థిక విధానాలే ఈ పరిస్థితికి కారణమని ఆయన ఆరోపించారు. ఈ సవాల్‌ను పరిష్కరించడానికి గత కొన్నేళ్లుగా అనేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.


ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ ఏర్పాటుచేసిన ‘స్వాలంభ భారత్ అభియాన్’ కార్యక్రమంలో దత్తాత్రేయ హోసబాలే పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనేక అంశాల్లో దేశం పురోగమించనప్పటికీ.. సవాళ్లను ఎదుర్కొంటున్న కొన్ని రంగాలు ఇంకా ఉన్నాయని అన్నారు. పేదరికం మన ముందున్న రాక్షసి లాంటి సవాల్ అని పేర్కొన్నారు. ‘‘పేదరికం మన ముందున్న రాక్షసి లాంటి సవాల్.. పేదరికం అనే దెయ్యాన్ని వధించాల్సిన అవసరం ఉంది.. 20 కోట్ల మందికిపైగా ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన జీవించడం బాధాకరం.. అంతేకాదు, 23 కోట్ల మందికిపైగా ప్రజల రోజువారీ ఆదాయం రూ.275 లోపే ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.


‘‘దేశంలో నాలుగు కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నాయి.. దేశంలో నిరుద్యోగ రేటు 7.6 శాతం ఉన్నట్టు కార్మిక శాఖ సర్వే చెబుతోంది’’ అని హోసబాలే పేర్కొన్నారు. ఉద్యోగాల కొరత, సరైన విద్య, పోషకాహారం లేకపోవడం, స్వచ్ఛమైన తాగునీటి కొరత, పర్యావరణ సమస్యలు వంటివి పేదరికానికి దారితీసే ప్రత్యేక అంశాలని వివరించారు. తన వ్యాఖ్యలకు ఆధారాలను ఐక్యరాజ్యసమితి డేటా, అభిప్రాయాన్ని ఉదహరించాడు.


‘‘అంతర్గత కలహాలు కూడా పేదరికానికి కారణం.. వాతావరణ మార్పులు కూడా పేదరికానికి కారణం.. కొన్నిచోట్ల ప్రభుత్వ అసమర్థత పేదరికానికి కారణం’’ అని ఆరోపించారు. ఉద్యోగాల కోసం అన్వేషించే యువత ఉద్యోగాలను కల్పించేవారికి ప్రోత్సహించాలని దత్తాత్రేయ సూచించారు. ‘‘వ్యవస్థాపకత వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది.. అన్ని పనులూ ముఖ్యమైనవేనని, సమానంగా గౌరవించాలనేది సమాజం గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది.. ఒక తోటమాలి తన పనికి గౌరవం పొందకపోతే.. ఎవరూ ఆ పని చేయడానికి ఇష్టపడరు. మన ఆలోచనా విధానం మార్చుకోవాలి’’ అని హోసబేలా ఉద్ఘాటించారు. ‘‘తొమ్మిది రోజుల నవరాత్రుల్లో విజయదశమి నాడు దుర్గామాత రాక్షసులను ఎలా సంహరించిందో.. అలాగే దశాబ్దాలుగా మనం ఎదుర్కొంటున్న ఈ సవాళ్ల నుంచి కూడా బయటపడాల్సి ఉంది’’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa