ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు జీజీహెచ్‌కు రూ.20 కోట్ల ఆస్తిని దానం చేసిన మహిళా డాక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 06, 2022, 04:14 PM

మనస్సు అందరికీ ఉన్నా గొప్ప మనస్సు కొందరికే ఉంటుందన్నది నిజం. వితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తిని తృణప్రాయంగా ఇచ్చేశారు అమెరికాలో ఉంటున్న ఓ తెలుగు వైద్యురాలు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్లుగా.. కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తిని గుంటూరు జీజీహెచ్‌ కు దానం చేశారు డాక్టర్ గవని ఉమ. భర్త మూడేళ్ల కిందట చనిపోవడం.. ఆమెకు వారసులు లేకపోవడంతో డాక్టర్‌ ఉమ గవని తన ఆస్తిని ఆస్పత్రికి ఇచ్చేసి గొప్ప మనసును చాటుకున్నారు. మొత్తం రూ.20 కోట్ల ఆస్తిని గుంటూరు జీజీహెచ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి గవని ఉమా విరాళం ప్రకటించారు.


గుంటూరు జిల్లాకు చెందిన ఉమ గుంటూరు మెడికల్ కాలేజీలో 1965లో మెడిసిన్‌ చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య పూర్తి చేసి 40 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి.. అక్కడే స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా స్ధిరపడ్డారు. అమెరికాలో ఇమ్యునాలజిస్ట్‌, ఎలర్జీ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత నెలలో డల్లాస్‌లో జరిగిన గుంటూరు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ రీ యూనియన్‌ సమావేశాలకు వెళ్లారు. ఈ వేదికపై తాను మెడిసిన్‌ చేసిన జీజీహెచ్‌కు భారీ విరాళం ఇవ్వాలన్న నిర్ణయాన్ని వెల్లడించారు. ఉమ తన తరపున, తన భర్త తరపున వచ్చిన ఆస్తి మొత్తాన్ని ఇచ్చేశారు.


మరోవైపు డాక్టర్ ఉమ 2008లో ‘జింకానా’ అధ్యక్షురాలిగా సేవలందించారు. అంతేకాదు ఈ విరాళంతో నిర్మాణం అవుతున్న జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ బ్లాక్‌కు ఆమె పేరును పెడతామని జింకానా సభ్యులు అన్నారు. ఉమ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. అలాగే ఆమె భర్త డాక్టర్‌ కానూరి రామచంద్రరావు పేరును ఈ బ్లాక్‌ను పెట్టాలని నిర్ణయించారు. డాక్టర్‌ కానూరి రామచంద్రరావు కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్‌ చేసి, ఎనస్థటిస్ట్‌గా సేవలు అందించారు. మూడేళ్ల కిందట ఆయన కన్నుమూశారు.


డాక్టర్ ఉమ తన ఆస్తిని జీజీహెచ్‌కు ఇవ్వడం మాత్రమే కాదు.. ఆమె స్ఫూర్తితో మిగిలిన డాక్టర్లు కూడా తమకు తోచిన విధంగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. పూర్వ విద్యార్థులు కూడా విరాళాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద డాక్టర్ ఉమ నిర్ణయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గొప్ప నిర్ణయం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని పొగడ్తలు కురిపిస్తున్నారు. పొరుగువాళ్లకు రూపాయి సాయం చేయని మనుషులు ఉన్న సమాజంలో.. ఇలాంటి గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. డాక్టర్ ఉమ ఇప్పుడు సోషల్ మీడియాలో గొప్ప సెలబ్రిటీ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa