ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో కేంద్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నా ప్రమాదాలు మాత్రం ఆగడంలేదు. తాజాగా కేరళలో గత అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాలక్కాడ్లోని వడక్కంచేరిలో జరిగిందీ ఘటన. విద్యార్థులతో కూడిన ఓ టూరిస్టు బస్సు కేరళ ఆర్టీసీ బస్సును వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, ఓ టీచర్, ముగ్గురు కేఎస్ఆర్టీసీ ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎర్నాకుళం జిల్లాలోని బేసెలియస్ విద్యానికేతన్కు చెందిన విద్యార్థులు, టీచర్లు విహార యాత్ర కోసం తమిళనాడులోని ఊటీ వెళ్తుండగా, కేఎస్ ఆర్టీసీ బస్సు కోయంబత్తూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గాయపడిన వారిలో మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa