తాజాగా పలు దేశాల విషయంలో వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధం సమస్యకు పరిష్కారం కోసం తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో వెల్లడించి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ విమర్శలు పాలైన విషయం తెలిసిందే. తాజాగా, చైనా-తైవాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల పరిష్కారానికి తన వద్ద ఓ ఉపాయం ఉందని వెల్లడించారు. తైవాన్పై కొంత నియంత్రణను బీజింగ్కు అప్పగించడం ద్వారా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించవచ్చని మస్క్ సూచించారు. ఫైనాన్షియల్ టైమ్స్కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ.. షాంఘైలో అతిపెద్ద టెస్లా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్న మస్క్ చైనా గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘తైవాన్ కోసం ఒక ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ జోన్ను గుర్తించడం అనేది సహేతుకంగా ఆమోదయోగ్యమైంది అనేది నా సిఫార్సు.. బహుశా అందరినీ సంతోషపెట్టదు.. అది సాధ్యమే.. వాస్తవానికి హాంకాంగ్ కంటే మరింత సామరస్యమైన పరిష్కారం కలిగి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను’ అని అన్నారు. స్వయంపాలిత తైవాన్ను తమ భూభాగమేనని వాదిస్తోన్న చైనా.. దానిని స్వాధీనం చేసుకుంటామని చాలా కాలం కిందటే ప్రతిజ్ఞ చేసింది. ఇందుకు బలప్రయోగాన్ని కూడా డ్రాగన్ తోసిపుచ్చలేదు. అయితే, చైనా సార్వభౌమాధికార వాదనలను తైవాన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ద్వీపంలోని 23 మిలియన్ల మంది ప్రజలు మాత్రమే దాని భవిష్యత్తును నిర్ణయించగలరని స్పష్టం చేసింది.
గతేడాది ప్రపంచవ్యాప్తంగా టెస్లా డెలివరీలలో షాంఘై ఫ్యాక్టరీ సగం వాటాను కలిగి ఉంది. తన స్పేస్ఎక్స్ రాకెట్ కంపెనీకి చెందిన స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీస్ను అక్కడ అందుబాటులోకి తీసుకురావద్దని చైనా కోరిందని మస్క్ చెప్పారు. తైవాన్పై సంఘర్షణ అనివార్యమని.. దీని ప్రభావం టెస్లాపై మాత్రమే కాకుండా ఐఫోన్ తయారీదారు యాపిల్, విస్తృత ఆర్థిక వ్యవస్థపై కూడా ఉంటుందని హెచ్చరించినట్లు మస్క్ చెప్పారు. ఇంటర్వ్యూలో మాత్రం ఆ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇవ్వలేదు.
ఇదిలవుంటే ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర గురించి మస్క్ చేసిన ట్వీట్లతో దుమారం రేగింది. ఇటీవల ఉక్రెయిన్లోని నాలుగు ప్రాంతాల్లో రెఫరెండం నిర్వహించిన రష్యా.. వాటిని అధికారికంగా విలీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై మస్క్ స్పందిస్తూ ఆ వివాదాస్పద ప్రాంతాల్లో ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో ఎన్నికలు నిర్వహించాలని, అక్కడ ప్రజలు ఇచ్చే తీర్పును ఇరు దేశాలు ఆమోదించాలని అన్నారు. అలాగే, క్రిమియాను రష్యా అధికారిక భూభాగంగా గుర్తించాలని, ఆ ప్రాంతానికి నీట సరఫరాను పునరుద్దరించాలని చెప్పారు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ ఈ రెండింటిలో మీరు దేన్ని ఇష్టపడతారని ప్రశ్నించారు. ఉక్రెయిన్కు మద్దతు ఇస్తారా? రష్యాకు మద్దతు ఇస్తారా? నిలదీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa