ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వామ్మో ఎనుగులు...ఉలిక్కిపడుతున్న రామకుప్పం రైతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 10, 2022, 11:54 PM

కష్టించి సేద్యం చేశాక కళ్లముందే పంట పాడవుతే ఏ రైతు గుండెనైనా తరక్కుపోతుంది. అలాంటి ఘటనే చిత్తూరుజిల్లాలో నెలకొంది. చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గజరాజుల దెబ్బకు అక్కడి ప్రజలు గజగజలాడుతున్నారు. రామకుప్పంలోని పలు గ్రామాల ప్రజలకు.. ఏనుగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రివేళల్లో పంటపొలాల్లోకి ప్రవేశిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయని స్థానిక రైతన్నలు వాపోతున్నారు.


ఈ ఏనుగులు అన్నీ తమిళనాడు నుంచి గుంపుగా వచ్చి కుప్పం సరిహద్దు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించాయి. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లోకి చొరబడుతూ వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రామకుప్పం మండలం రామాపురం, వీర్ణమల, బందార్లపల్లి, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. కష్టపడి పండించిన వరి, అరటి, టమోటా, బీన్స్ వంటి పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల భయంతో ఎక్కడికైనా వెళ్లాలంటేనే భయమేస్తోందని చెబుతున్నారు.


పది రోజుల నుంచి పంటపొలాల్లోకి ప్రవేశిస్తూ ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని రామకుప్పం ప్రజలు ఆరోపిస్తున్నారు. కష్టపడి పండించిన పంటలను నాశనం చేశాయని.. పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదేవిధంగా ఏనుగుల గుంపును తిరిగి అడవిలోకి మళ్లించేలా ఫారెస్ట్ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే తమకు ఇబ్బందులు తప్పవని రామకుప్పం మండల ప్రజలు వాపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa