ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింధ్ ప్రావిన్స్ లో ఘోర అగ్ని ప్రమాదం...21 మంది సజీవదహనం

international |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 12:01 AM

విధి వెంటాడటంతో పాకిస్తాన్ లో ఘోర బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. వరద బాధితులతో వెళ్తోన్న బస్సు ప్రమాదవశాత్తూ మంటల్లో చిక్కుకుని కనీసం 21 మంది సజీవదహనమయ్యారు. వీరిలో 12 మంది చిన్నారులు ఉండటం మరింత బాధాకరం. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన బుధవారం రాత్రి పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. సింధ్ ప్రావిన్సుల్లోని కరాచీ, హైదరాబాద్, జమ్షారో ఎం-9 మోటార్‌వే వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయానికి బస్సులో 45 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరంతా ఇటీవల సంభవించిన వరదలతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లి తిరిగి తమ స్వస్థలాలకు వస్తున్నట్టు పేర్కొన్నారు.


‘‘ప్రమాదంలో ఇప్పటి వరకూ 17 మంది ప్రాణాలు కోల్పోయారు.. మరో 10 మందిని సహాయక సిబ్బంది రక్షించి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు’’ అని సింధ్ ప్రావిన్సుల ఆరోగ్య విభాగం సెక్రెటరీ సిరాజ్ ఖాసిమ్ సూమ్రో వివరించారు. దాదు జిల్లాకు చెందిన వీరంతా ప్రయివేట్ బస్సును మాట్లాడుకుని పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు తిరిగొస్తున్నారని జామ్షారో కలెక్టర్ అసిఫ్ జమీల్ అన్నారు.


గత ఆగస్టులో పాక్‌ను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. వరదల కారణంగా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిని కరాచీలోని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించి వసతి కల్పించారు. ప్రస్తుతం పరిస్థితి చక్కబడటంతో బాధితులు తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా వరద బాధితులు రైల్, బస్సులలో సొంతూర్లకు వెళుతున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలేంటో తక్షణమే తెలియరాలేదు. అయితే, బస్సులోని ఓ భాగంలో తొలుత మంటలు చెలరేగి మొత్తం వ్యాపించాయని పోలీసులు తెలిపారు. మంటల్లో బస్సు కాలిపోతుంటే పలువురు బయటకు దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఏసీ బస్సులో షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ ఘోరం జరిగినట్లు సమాచారం. కాగా, ఆగస్టు 20న దక్షిణ పంజాబ్‌లో మోటార్‌వేపై ఇటువంటి ప్రమాదమే చోటుచేసుకుంది. ముల్తాన్ సమీపంలో ఓ ఆయిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టిన ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, పాకిస్థాన్‌లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. ముఖ్యంగా అతివేగం, అధ్వానమైన రహదారులు, భద్రత ప్రమాణాలు పాటించని వాహనాలు కారణంగా ప్రమాదాలకు హేతువుగా మారింది. 2017లో ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడి మంటలు అంటుకుని 100 మంది సజీవదహనమయ్యారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa