రాయలసీమ వాసిగా ఉంటూ. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాయలసీమకు తీరని మోసం, ద్రోహం, అన్యాయం చేయడం బాధాకరం మని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. గురువారం వేంపల్లి పట్టణంలో ఆయన మాట్లాడుతూ. వైకాపా పాలనలో రాయలసీమకు నవమోసాలు జరిగాయన్నారు. విభజన చట్టం ప్రకారం రాయలసీమకు, ఉత్తరాంధ్రకు కేంద్ర ప్రభుత్వం బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ది ప్యాకేజ్ నిధులు ఇవ్వాలి, విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు.
రాష్ట్ర సచివాలయాన్ని (రాజధానినీ) అమరావతి నుండి విశాఖ కు తరలిస్తే రాయలసీమ వాసులే నష్టపోతారన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని, హై కోర్టులలో ఒక దానిని రాయసీమలో ఏర్పాటు చేయాలి. కానీ ఒకటి రాలేదు. జగన్, చంద్రబాబు ఇద్దరు కారకులే. కడప - రాయచోటి - మదనపల్లి - బెంగళూరు నూతన బ్రాడ్ గేజ్ రైలు మార్గం రాయలసీమ సర్వోతోముఖాభివృద్ధికి ఎంతో అవసరం. జగన్ ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వని కారణంగా పనులు నిలిచి పోయాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలన్నారు.
కృష్ణా నదీ మీద ఉన్న ప్రాజెక్టులు ప్రథానంగా రాయలసీమలో ఉండగా, బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో కాకుండా విజయవాడ లో పెట్టాలని చంద్రబాబు, విశాఖలో పెట్టాలని జగన్ లేఖలు రాయడం శోచనీయమన్నారు. తెలుగు గంగ, గాలేరు - నగరీ, హంద్రీ - నీవా, వెలిగొండ ప్రాజెక్టు లు నిధులు లేని కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉండి పోయాయి. ఎగువ రాష్ట్రమైన తెలంగాణ నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా అక్రమంగా పాలమూరు - రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తోంది. ఇవీ పూర్తి అయితే శ్రీశైలం రిజర్వాయర్ కు చుక్క నీరు రాదు. సీమ ప్రాజెక్టులన్నీ నిరుపయోగం అవుతాయి. ఇంత జరుగతున్నా జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం శోచనీయం.
రాయలసీమలోనే ఎక్కువ వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి. వీటికి స్మార్ట్ మీటర్లు బిగించి, ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేస్తే , ఎక్కువగా నష్ట పోయేది రాయలసీమ రైతులే. రాయలసీమకు ద్రోహం చేస్తున్న వైకాపా, టిడిపి, బిజెపి లను రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఓడించి, కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa